ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సున్నా వడ్డీకి ఏదీ అండ?.. వాణిజ్య బ్యాంకుల మోకాలడ్డు

By

Published : Jul 12, 2020, 6:19 AM IST

ఏడాదిలోగా పంట రుణాలు చెల్లించే రైతులకు సున్నా వడ్డీ ప్రయోజనాలను వర్తింపజేయడంలో అధిక శాతం వాణిజ్య బ్యాంకులు మోకాలడ్డుతున్నాయి. కేంద్రం ఇచ్చే 5% వడ్డీ రాయితీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని రైతుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి.

farmers facing problems with zero interest loans
farmers facing problems with zero interest loans

సహకార బ్యాంకులు మాత్రం రుణం చెల్లించే సమయంలో సున్నా వడ్డీ వర్తింపజేసి (2018-19 వరకు) తర్వాత ప్రభుత్వం నుంచి తీసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే అయిదేళ్ల బకాయిల కింద ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రూ.1,053 కోట్లలోనూ 40% వాటా ఈ బ్యాంకుల పరిధిలోని రైతులకే చేరనుంది. 5 గ్రామీణ బ్యాంకుల పరిధిలోని రైతులకు 31.5% అందుతుండగా.. 17 వాణిజ్య, ప్రైవేటు బ్యాంకుల పరిధిలో పంట రుణాలు పొందిన వారికి 28.5% మాత్రమే దక్కుతోంది. గ్రామీణ బ్యాంకుల్లోనూ.. ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు (ఏపీజీబీ) మినహా మిగిలినవన్నీ అంతగా పట్టించుకోవడం లేదు. ఏడాదిలోగా రుణం చెల్లించిన రైతుల జాబితాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు పంపడంలోనూ శ్రద్ధ చూపట్లేదు. ఫలితంగా అన్నదాతలు ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీకి దూరమవుతున్నారు.

2018-19లోనే రూ.800 కోట్లు
రెండేళ్ల కిందట (2018-19) ఖరీఫ్‌, రబీకి కలిపి బ్యాంకులు రూ.76,721 కోట్ల పంట రుణాలనిచ్చాయి. ఇందులో ఏడాదిలోగా రైతులు 75% చెల్లించినా రూ.57,540 కోట్లు బ్యాంకులకు జమవుతాయి. వాటి నుంచి బంగారంపై రుణాలు, రూ.లక్షకు పైగా ఇచ్చే పంట రుణాల కింద 40శాతం వరకు తీసేసినా రూ.34వేల కోట్ల వరకు గడువులోగా చెల్లిస్తున్నట్లే.
ఇలా ఏడాదిలో చెల్లించే పంట రుణంపై విధించే 9 శాతం వడ్డీ నుంచి కేంద్రం 5% రాయితీనిస్తోంది. మిగిలిన 4 శాతం సున్నా వడ్డీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది. ఈ లెక్కన రూ.34వేేల కోట్లకు రూ.1,360 కోట్ల మేర సున్నా వడ్డీ రూపంలో రైతులకు అందాల్సి ఉంది. అయితే మొత్తం సున్నా వడ్డీ ప్రయోజనాలు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లకు మించడం లేదు.
* 2018-19లో మొత్తం సున్నా వడ్డీ బకాయిలుగా రూ.557.58 కోట్లను తేల్చారు. అంటే సక్రమంగా చెల్లించిన రుణాల్లో 41% మాత్రమే సున్నా వడ్డీ పరిధిలోకి వస్తుంది. 51% రుణాలను ఏడాదిలోగా క్రమం తప్పకుండా చెల్లించినా ప్రయోజనం దక్కడం లేదు. ఇలా ఏడాదిలో రూ.800 కోట్ల మేర రైతులు కోల్పోయారు. అయిదేళ్లకు చూస్తే రూ.4వేల కోట్ల మేర సొమ్ము చేజారినట్లే.
* సున్నా వడ్డీ కింద ఆప్కాబ్‌కు రూ.171.25 కోట్లు, ఏపీజీబీకి రూ.111.05 కోట్లు విడుదలయ్యాయి. వాణిజ్య బ్యాంకుల్లో ఆంధ్రా బ్యాంకుకు రూ.103.02 కోట్లు, ఎస్‌బీఐకి రూ.51.39 కోట్లు మంజూరయ్యాయి. వాస్తవానికి ఆ ఏడాది ఎస్‌బీఐ రూ.13,740 కోట్లు, ఆంధ్రా బ్యాంకు రూ.11,086 కోట్ల పంట రుణాలనిచ్చాయి. ఆప్కాబ్‌ పరిధిలోని సహకార బ్యాంకులు రూ.12,736 కోట్ల పంట రుణాలనిచ్చాయి. అంటే ఎక్కువ రుణాలిచ్చిన బ్యాంకులకంటే ఆప్కాబ్‌కే సున్నా వడ్డీ రాయితీ ఎక్కువగా వచ్చింది.
* రాష్ట్రంలో ఏటా పంట రుణాలిచ్చే బ్యాంకుల్లో ఎస్‌బీఐ వాటా 26%, ఆంధ్రాబ్యాంకు వాటా 21% పైనే. సిండికేట్‌, ఇండియన్‌, కెనరా తదితర బ్యాంకుల వాటా మరో 25% వరకుంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సున్నా వడ్డీ నిధుల్లో వాణిజ్య, ప్రైవేటు బ్యాంకులన్నిటికీ కలిపి రూ.300 కోట్లు (28.5%) మాత్రమే వచ్చాయి. అధిక శాతం రుణాలిచ్చే ఎస్‌బీఐ వాటా 9 శాతానికే పరిమితమైంది.

ఇప్పటికీ మించి పోలేదు
ఏడాదిలోగా చెల్లించిన పంట రుణాలపై కేంద్రం 5% వడ్డీని బ్యాంకులకు తిరిగి చెల్లిస్తుంది. అంటే సంబంధిత రైతుల జాబితాతోనే బ్యాంకులు కేంద్రానికి క్లెయిమ్‌ చేస్తాయి. ఇదే జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికిస్తే సున్నా వడ్డీ రాయితీ దక్కుతుంది. బకాయిల విడుదలకు ప్రభుత్వం ముందుకొచ్చినందున ఈ దిశగా బ్యాంకర్లు, వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details