ప్రకాశం బ్యారేజికి ఎగువ నుంచి భారీగా నీరు చేరుతుండడంతో.. ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పులిచింతలనుంచి.. లక్ష క్యూసెక్కులకుపైగా నీరు దిగువకు వదిలినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నాగార్జునసాగన్ నుంచి.. మరో 4 లక్షల క్యూసెక్కులపైగా నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పటంతో ప్రకాశం బ్యారేజీకి మరింత నీటి ఉద్ధృతి పెరగనుంది.
ఇప్పటికే ప్రకాశం బ్యారేజి 3.07 టీఎంసీలతో పూర్తి స్థాయి నీటి మట్టం ఉండడంతో కొన్ని గేట్ల ద్వారా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. రేపు పూర్తి స్థాయిలో బ్యారేజి మొత్తం 70 గేట్లు ఎత్తుతున్నట్లు.. జిల్లా కలెక్టర్ జే.నివాస్ సహా అధికారులు చెప్పటంతో కృష్ణలంక, తారరామ నగర్ రామ లింగేశ్వర సహా ముంపు ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"మాకు పునరావాసం కల్పించకుండా.. ఎక్కడా తాత్కాలిక ఇళ్ల కేటాయించకుండా వెళ్లమంటే ఎలా? నీటి ఉద్ధృతిని అడ్డుకునేందుకు నిర్మిస్తున్న రిటర్నింగ్ వాలు కోసం.. మా ఇళ్లని కూడా కూల్చారని ఇక్కడే గుడిసెలు వేసుకొని బతుకుతున్నాము. ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటే ఎక్కడికి పోవాలి? మాకు మరో మార్గం లేదు. ఈ ఇళ్లల్లోనే చిన్న పిల్లలతో ఉంటున్నాం" -ముంపు గ్రామాల ప్రజల ఆవేదన