ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 16, 2021, 3:39 PM IST

ETV Bharat / city

Boat Seeing: కృష్ణా నదిలో ప్రారంభమవుతున్న విహారయాత్రలు

కొవిడ్‌ నేపథ్యంలో నిలిచిపోయిన జలయాత్రలు త్వరలో ప్రారంభం కానున్నాయి. సోమశిల ప్రాజెక్టు-శ్రీశైలం, నాగార్జునసాగర్‌-శ్రీశైలం మధ్య నీటి అలలపై ప్రయాణించే పర్యాటక ప్యాకేజీల్ని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ శనివారం నుంచి పునరుద్ధరిస్తోంది. కృష్ణా నదిలో నీటిమట్టం లాంచీలు ప్రయాణించేందుకు అనువుగా ఉండటంతో ఈ యాత్రలను ప్రారంభిస్తున్నట్టు పర్యాటక అభివృద్ధి సంస్థ వర్గాలు తెలిపాయి.

కృష్ణా నదిలో ప్రారంభమవుతున్న విహారయాత్రలు
కృష్ణా నదిలో ప్రారంభమవుతున్న విహారయాత్రలు

కృష్ణా నదిలో నీటిమట్టం లాంచీలు ప్రయాణించేందుకు అనువుగా ఉండడంతో జలయాత్రలు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ తెలిపింది. కరోనా నేపథ్యంలో నిలిపివేసిన సేవలను... శనివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.

  • హైదరాబాద్‌-శ్రీశైలం-సోమశిల:ఉదయం 7.30కి హైదరాబాద్‌ నుంచి సోమశిలకు బస్సులో తీసుకెళ్తారు. అక్కడి ఆలయంలో దర్శనం. తర్వాత సోమశిల నుంచి శ్రీశెలానికి లాంచీలో ప్రయాణం. మధ్యాహ్న భోజనం ప్రయాణంలోనే. రాత్రి బస శ్రీశైలంలో. ఉదయం అల్పాహారం, శ్రీశైలం ఆలయంలో దర్శనం తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌కు రోడ్డుమార్గంలో ప్రయాణం. ఇది రెండురోజుల ప్యాకేజీ. ధర ఒక్కరికి రూ.3,999.
  • హైదరాబాద్‌-శ్రీశైలం-నాగార్జునసాగర్‌:ఇది రోడ్‌కమ్‌ రివర్‌ క్రూయిజ్‌ టూర్‌. గతంలో శ్రీశైలం నుంచి ఈ యాత్ర సాగర్‌ వరకు ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉప్పల శ్రీనివాస్‌గుప్త తెలిపారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం రోడ్డుమార్గంలో పయనం. రాత్రి శ్రీశైలం/ఈగలపెంటలో బస. రెండో రోజు శ్రీశైలం నుంచి సాగర్‌కు లాంచీలో ప్రయాణం. ఈ ప్యాకేజీ ధర ఒక్కరికి రూ.3,999.
  • ఈ రెండు యాత్రలు ప్రతి శనివారం ఉంటాయని, పర్యాటకుల నుంచి డిమాండ్‌ ఉండి కనీసం 70 మంది ఉంటే వారంలో మూడు ట్రిప్పుల వరకు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారి జ్యోతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details