Employees protest to abolish CPS: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దే లక్ష్యంగా సెప్టెంబర్1 న మిలీనియం మార్చ్ నిర్వహించాలని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ తమను నిలువునా మోసం చేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దుచేయకుండా జీపీఎస్ అమలు చేస్తామంటూ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. సీపీఎస్ రద్దు చేయని పక్షంలో తమ సత్తా ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు
సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు ఆందోళన కొనసాగుతోంది. ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో పోరాటం చేస్తోన్న ఉద్యోగులు విజయవాడ ధర్నాచౌక్లో నిరసన చేపట్టారు. 'ఓపీఎస్ సంకల్పదీక్ష' పేరిట ఆందోళనకు దిగారు. సీపీఎస్ రద్దు చేయకపోవడాన్ని నిరసిస్తూ 'దగాకోరు మోసం' అంటూ దీక్షా స్థలిలో బ్యానర్లు ప్రదర్శించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసిన ఛత్తీస్గఢ్, రాజస్థాన్ సీఎంలను ప్రసంశిస్తూ సీపీఎస్ ఉద్యోగుల పాలిట దేవుళ్లంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫొటోలకు సీపీఎస్ ఉద్యోగులు పాలభిషేకం చేశారు.