ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 21, 2020, 3:17 PM IST

ETV Bharat / city

పొట్ట చేత్తో పట్టుకుని వచ్చిన వారే.. తిరిగి వెళ్లిపోతున్నారు!

ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదని పేరొందింది విజయవాడకు చెందిన జవహర్‌ ఆటోనగర్‌. ఇక్కడ సుమారు లక్షమంది కార్మికులు పని చేస్తున్నారని అంచనా. అయితే ఇప్పుడు పరిస్థితి ఎంతో మారిపోయింది. పనులన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. పొట్టకూటి కోసం ఆటోనగర్‌ను నమ్ముకునే కార్మికులు సన్నగిల్లుతున్నారు. కరోనాతో అక్కడి వారి జీవితాలను దయనీయంగా మార్చేసింది.

పొట్ట చేత్తో పట్టుకుని వచ్చిన వారే.. తిరిగి వెళ్తున్నారు!
పొట్ట చేత్తో పట్టుకుని వచ్చిన వారే.. తిరిగి వెళ్తున్నారు!

దక్షిణ భారతావనికే తలమానికంగా విజయవాడ జవహర్‌ ఆటోనగర్‌ పేరుగాంచింది. ఆటోమొబైల్‌ నుంచి అన్ని రంగాల్లోనూ తయారీకి కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుల వలసలు... మూతపడిన పరిశ్రమలు ఇలా ఒక సమస్య వెంట మరో సమస్య వెంటాడుతూనే ఉంది. ఆటోమొబైల్‌, వాహనాల విడిభాగాల తయారీ, అమ్మకాలకు ఇది నిలయం. బెజవాడ నగర శివారులో పారిశ్రామిక ఎస్టేట్‌ పక్కన దాదాపు 275ఎకరాల స్థలంలో జవహర్‌ ఆటోనగర్‌ను 1966లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్థాపించారు.

ఆటోమొబైల్‌కు సంబంధించిన అన్ని విడిభాగాలు, లారీ బాడీ బిల్డింగ్‌కు సంబంధించిన యూనిట్లన్నీ ఒకే చోట ఏర్పాటవడంతో దీనికి 'ఆటోనగర్‌' అని నామకరణం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ఆటోనగర్‌ అనే పేరు వాడుకలోకి వచ్చింది విజయవాడ ఆటోనగర్‌ నుంచే. ఆటోమొబైల్‌కు సంబంధించిన కార్పెంటర్‌, టింకరింగ్‌, వెల్డింగ్‌, టైర్‌ రీత్రెడ్డింగ్‌, పెయింటర్స్‌, ఇంజిన్‌ రీబోరింగ్‌, ఫ్యూయల్‌ ఇంజక్షన్‌, మెకానిక్‌ తదితర పనులతో వివిధ వృత్తుల వారు ఆటోనగర్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

ఎలా కావాలంటే.. అలా చేస్తారు

లారీలు, బస్సులకు బాడీలు కట్టడంలో ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఛాసిస్ వాహనాన్ని తీసుకొచ్చి, కార్మికులకు అప్పగిస్తే చాలు, యజమాని అభిరుచి మేరకు ఎలా కావాలంటే అలా బాడీలు కట్టి, అద్దంలా తయారు చేసి ఇస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన లారీ యజమానులు కూడా ఇక్కడికే వచ్చి లారీలకు బాడీలు కట్టించుకొని వెళ్తుంటారు. అలాంటి ఆటోనగర్ ఇప్పుడు పూర్తిగా వెలవెలబోతోంది. ఇప్పుడక్కడి పరిస్థితులే వేరు. హడావుడేమీ కనిపించట్లేదు సరికదా.. రోజువారీ కూలి దొరకడమే కష్టమవుతోంది.

లెక్కలు కట్టి చూస్తే.. ఒకప్పటి కంటే ఇప్పుడక్కడ 50 శాతం మంది కార్మికులే ఉంటే అందులో 25 శాతం మందికే పని ఉంది. కరోనా తెచ్చిన తంటాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్న ఎందరో జీవితాలను తలకిందులు చేసింది.

చివరినెలలో రద్దీ.. ఇప్పుడేది?

ఏడాది చివరి నెలల్లో ఆటోనగర్‌ అంతా కార్మికుల కష్టంతో తడిసి ముద్దయ్యేది. కొత్త సంవత్సరం ప్రారంభంలో, సంక్రాంతి సంబరంలో భాగంగా కొత్త బండ్లు తయారు చేయించుకునే వారితో బిజీగా ఉండే ప్రాంతం ఇప్పుడెలాంటి కళ లేకుండా ఎదురుచూస్తోంది. కరోనా.. వ్యాపారస్తులపైనా అత్యధిక ప్రభావాన్ని చూపించింది. ఈ క్రమంలోనే మోటారు ఫీల్డు కూడా ఎంతో దెబ్బతింది. అన్ని విధాలా రేట్లు పెరిగిపోవడంతో వ్యాపారస్థుల మాట అటుంచితే కార్మికుల, కూలీల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఆటోనగర్‌ లారీల యజమానులు ఇంకెవ్వరూ లారీలు తీసుకోవద్దని అందరికీ చెబుతున్నారు.

ఇకపై ఇక్కడ లారీలు తిరిగే పరిస్థితి లేదు కాబట్టి వాటిపై పెట్టుబడి పెట్టేవారూ తగ్గిపోయారు. తద్వారా మెకానిక్‌ షెడ్లు మూతపడుతున్నాయి. టైర్లు పంచర్లు వేసుకునే వారి దగ్గర నుంచి మెకానిక్‌లు, ఆటోమొబైల్స్‌కు సంబంధించిన వ్యాపారాలు, స్పేర్‌పార్ట్స్‌ వ్యాపారస్థులు, బాడీబిల్డింగ్‌ వర్కర్లు, పరదాలు-తాళ్లూ అమ్ముకునేవారు, ముఠా కార్మికులు... ఇలా చెప్పుకుంటూపోతే... లారీలకూ, మోటారు ఫీల్డుకీ అనుసంధానమైన విభాగాలన్నీ కుదేలవుతున్నా మొత్తంగా ఆటోనగర్‌లో అన్ని రకాలుగా సంక్షోభం తాండవిస్తోంది.

రాయితీ కల్పించాలి

ఆటోనగర్‌ పూర్వ వైభవాన్ని పొందాలన్నా... కనీసం అక్కడి కార్మికులకు నిత్యావసరాలు సమకూరాలన్నా ప్రభుత్వం ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తూనే ఆటోనగర్​ను హైవేకు అనుబంధంగా విస్తరించాలని కోరుతున్నారు. ముఖ్యంగా వర్కర్ల సంక్షేమం కోసం ప్రణాళికను రూపొందించి మోటారు రంగాన్ని అభివృద్ధిపరిచే దిశలో తగిన చర్యలు చేపట్టాలంటున్నారు. సరైన సదుపాయాలు సమకూర్చి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆటోనగర్‌ పది మందికి పని కల్పించి, ప్రాణం పోస్తుందని ఆశిస్తున్నారు.

ఎంత సమయం పడుతుందో?

లాక్​డౌన్​ నుంచి మినహాయింపులు వచ్చి.., ఉత్పత్తి తిరిగి ప్రారంభించేందుకు అనుమతులు మంజూరైనా ప్రస్తుత పరిస్థితి ఏమంత ఆశాజనకంగా మాత్రం లేదు. కరోనా కారణంగా తీవ్రస్థాయిలో కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వున:ప్రారంభమైనా మార్కెట్ కష్టాలు, కార్మికుల కొరత, రవాణలేమి లాంటి ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. లాభాల సంగతి దేవుడెరుగు నమ్ముకున్న ఉద్యోగుల కోసం యూనిట్లు తెరవటమే తప్ప నష్టం నుంచి కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ఆటోనగర్​లోని చిరు పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details