విద్యను కూడా వ్యాపారం చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. డిగ్రీ కళాశాలల్లో 30 శాతం సీట్లు అమ్ముకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శోచనీయం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అసలే ప్రభుత్వ కళాశాలల్లో వసతులు లేవని విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలను తీసుకోవడం తగదన్నారు.
2020–21 విద్యా సంవత్సరానికి ఆన్లైన్లో నిర్వహించిన ప్రవేశాల్లో వివిధ డిగ్రీ కోర్సుల్లో 2.62 లక్షల మందికి ఉన్నత విద్యా మండలి సీట్లు కేటాయించిందని, వీరిలో 65,981 మంది తెలుగు మాధ్యమంలో చేరినవారు. వీరిలో 24,007 మంది బీఏ, 16,925 మంది బీకాం, 24,960 మంది బీఎస్సీ, 89 మంది ఇతర కోర్సులను ఎంపిక చేసుకున్నారన్నారు.