ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు : సీఎం జగన్

రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్‌ 21న భూముల సమగ్ర సర్వే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రికార్డులు తారుమారు చేసేందుకు ఏ మాత్రం ఆస్కారం లేకుండా ఉండేలా సర్వే సహా రికార్డులు తయారు చేయాలని ఆదేశించారు.

By

Published : Dec 8, 2020, 4:08 PM IST

Updated : Dec 9, 2020, 5:00 AM IST

డిసెంబర్ 21న భూముల సమగ్ర సర్వే ప్రారంభం: సీఎం
డిసెంబర్ 21న భూముల సమగ్ర సర్వే ప్రారంభం: సీఎం

ఒక గ్రామంలో భూముల సర్వే పూర్తయి, మ్యాప్‌లు సిద్ధం కాగానే... ఆ గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఆ మేరకు గ్రామ సచివాలయాల్లో మార్పులు చేయాలని సూచించారు. భూవివాదాల పరిష్కారానికి సంచార ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన వాహనాలు సహా అన్ని సదుపాయాలూ సమకూర్చుకోవాలన్నారు. ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం’పై ఆయన మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ నెల 21 నుంచి భూముల సమగ్ర సర్వే ప్రారంభమవుతుందని సీఎం తెలిపారు.

‘అటవీ ప్రాంతాలు మినహా... గ్రామాలు, ఆవాసాలు, పట్టణాలు, నగరాలతో కలిపి 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే జరుగుతుంది. మూడు విడతల్లో మొత్తం 17,460 గ్రామాల్లో సర్వే జరుగుతుంది. పట్టణాలు, నగరాల పరిధిలో 3,345.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో, 10 లక్షల ఓపెన్‌ప్లాట్లు, 40 లక్షల అసెస్‌మెంట్ల భూముల్లో, 90 లక్షల మంది పట్టాదారులకు చెందిన 2.26 కోట్ల ఎకరాలను సర్వే చేస్తారు’ అని సీఎం తెలిపారు. సర్వేపై శిక్షణ ఇచ్చేందుకు తిరుపతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో అకాడమీని త్వరిత గతిన ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సర్వేలో భాగస్వాములవుతున్న సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వాలని సూచించారు. సర్వే పూర్తయ్యాక ఆ రికార్డుల్లో మార్పులు చేయడం ద్వారా అవకతవకలకు పాల్పడలేని విధంగా భద్రపరచాలని ఆదేశించారు. ‘సెక్యూరిటీ ఫీచర్స్‌ పటిష్టంగా ఉండాలి. ఆ మేరకు సర్వే వ్యవస్థను తీర్చిదిద్దాలి. భూ యజమానుల దగ్గర హార్డ్‌ కాపీ ఉండేలా చూడాలి’ అని సీఎం స్పష్టం చేశారు.

ప్రతి భూ యజమానికీ ప్రత్యేక కార్డు


సర్వే పూర్తయ్యాక ప్రతి భూ యజమానికీ ల్యాండ్‌ టైటిలింగ్‌ కార్డు అందిస్తారని, దానిపై ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు) ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఆస్తి విస్తీర్ణం, కొలతలు, యజమాని పేరు, ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ కార్డుపై ఉంటాయని వెల్లడించారు. సర్వే పూర్తయ్యాక డిజిటైజ్డ్‌ కెడస్ట్రల్‌ మ్యాప్‌ తయారు చేస్తారని, గ్రామంలోని ప్రతి కమతం, భూమి వివరాలు మ్యాప్‌లో ఉంటాయని తెలిపారు. భూమి కొలతలు పూర్తయ్యాక సర్వే రాళ్లు పాతుతారని, గ్రామ సచివాలయంలో డిజిటైజ్డ్‌ ప్రాపర్టీ రిజిస్టర్‌, టైటిల్‌ రిజిస్టర్‌ ఉంటాయన్నారు. వివాదాల నమోదుకూ రిజిస్టర్లు ఏర్పాటు చేస్తారని ఆయన వెల్లడించారు.

సర్వే ఆఫ్‌ ఇండియాతో నేడు ఒప్పందం
భూముల సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థ శిక్షణ ఇస్తోందని, ఆ సంస్థతో బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి మండలానికీ ఒక డ్రోన్‌ బృందం, డేటా ప్రాసెసింగ్‌, రీ సర్వే బృందాలు ఉంటాయని తెలిపారు. ఇప్పటి వరకు 9,400 మంది సర్వేయర్లకు శిక్షణనిచ్చామని, మిగిలినవారికీ త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం తదితరులు పాల్గొన్నారు. తొలుత ‘కార్స్‌’ టెక్నాలజీ ఆధారంగా రోవర్స్‌ ద్వారా రీసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో.. తొలుత డ్రోన్ల ద్వారా రీసర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు. రోవర్స్‌ వచ్చిన తర్వాత ఎంపికచేసిన ప్రదేశాల్లో ‘కార్స్‌’ టెక్నాలజీతో సర్వే చేస్తారు.

ఇదీ చదవండి:రైతులకు మద్దతుగా నిలవాలని రాహుల్ పిలుపు

Last Updated : Dec 9, 2020, 5:00 AM IST

ABOUT THE AUTHOR

...view details