ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 14, 2021, 4:44 PM IST

Updated : Feb 15, 2021, 3:45 AM IST

ETV Bharat / city

వైకాపా నేతలకు సొంతూళ్లలోనే ఛీత్కారాలు : చంద్రబాబు

వైకాపా ప్రజాప్రతినిధుల్ని సొంత గ్రామాల్లోని ప్రజలే ఛీకొట్టే పరిస్థితి ఉందని, వారి పునాదులు కంపిస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రులు కొడాలి నాని, గౌతమ్‌రెడ్డి, ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేశ్‌ తదితరుల స్వగ్రామాల్లో.. వైకాపా మద్దతుదారులైన అభ్యర్థులు ఓడిపోయారని చెప్పారు. మరో ఎంపీ స్వగ్రామమైన కర్నూలు జిల్లా రుద్రవరంలో తెదేపా బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని గుర్తుచేశారు.

chandrababu on panchayat elections
chandrababu on panchayat elections

రెండో దశ ఎన్నికలు జరిగిన స్థానాల్లో తెదేపా మద్దతుదారులు 1,033, తెదేపా పొత్తుతో గెలిచినవారు 65 కలిపి మొత్తం 1,095 స్థానాల్లో (39.52%) విజయం సాధించారని వివరించారు. మంగళగిరిలో చంద్రబాబు ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ‘రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. శనివారం రాత్రి 10 గంటల వరకు తెదేపా మద్దతుదారులకు ఏకపక్షంగా వచ్చాయి. అక్కణ్నుంచి చీకటి రాజకీయం మొదలైంది. విద్యుత్తు సరఫరా నిలిపేశారు. ఏజంట్లను బలవంతంగా బయటకు పంపారు. పోలీసులతో బెదిరించారు. చెల్లని ఓట్లను కలిపి లెక్కించారు. తెదేపా బలపరిచిన అభ్యర్థులు గెలిచిన చోట్ల.. వైకాపా మద్దతుదారులు గెలిచినట్లు ప్రకటింపజేశారు. మా వాళ్లకు 200 నుంచి 300 ఓట్ల మెజార్టీ వచ్చినా రీకౌంటింగ్‌కు ఆదేశించారు. అవతలివాళ్లు రెండు ఓట్ల తేడాతో గెలిచినా రీకౌంటింగ్‌కు అంగీకరించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 10% ఫలితాలు ఇలా మార్చేశారు’ అని ఆగ్రహం వెలిబుచ్చారు. ‘హైకోర్టులో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాక కూడా శ్రీకాళహస్తిలో 14, తొట్టంబేడులో మూడు, ఏర్పేడులో 17.. మొత్తం 34 మంది నామినేషన్లను తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారో అభ్యర్థికి చెప్పలేదు. ఇలా బరితెగిస్తున్న అధికారుల్లో ఏ ఒక్కరినీ వదలబోమ’ని హెచ్చరించారు.

ఎస్‌ఈసీ గట్టిగా చెబితే ఇవన్నీ జరుగుతాయా?

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గట్టిగా చర్యలు చేపట్టి ఉంటే.. శ్రీకాళహస్తిలాంటి సంఘటనలు జరిగేవి కావని చంద్రబాబు పేర్కొన్నారు. పుంగనూరు, మాచర్ల, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించే విషయమై ఎస్‌ఈసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ‘పంచాయతీ ఎన్నికల బ్యాలెట్‌ పెట్టెలను మండల కేంద్రానికి చేర్చి లెక్కించాలి. సర్పంచి అభ్యర్థుల ఓట్లనే ముందు లెక్కించాలి’ అని డిమాండు చేశారు.

పోలీసుల్ని పెట్టి బయటికి గెంటేశారు

‘ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం చవిటిపాలెంలో తెదేపా మద్దతుదారులు గెలిచిన స్థానాన్ని.. అవతలి వారు గెలిచినట్లు ప్రకటించారు. చెల్లని ఓట్లు కూడా కలిపారు. అదేంటని అడిగితే పోలీసుల్ని పెట్టి మా వాళ్లను బయటకు పంపారు’ అని చంద్రబాబు ఆగ్రహం ప్రకటించారు. ‘నాలుగు రోజులు కష్టపడండి, జగనన్న ఉంటే మనం ఉంటాం.. వన్‌సైడ్‌గా చేయండి’ అంటూ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ వాలంటీర్లతో మాట్లాడుతున్న వీడియోను ప్రదర్శింపజేశారు.

చవిటిపాలేనికి చెందిన ఉమామహేశ్వరరావు, సర్పంచి అభ్యర్థి సుమలత వచ్చి మాట్లాడారు. ‘5 పోస్టల్‌ బ్యాలెట్ల మీద స్వస్తిక్‌ గుర్తు వేశారు కాబట్టి చెల్లవన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారిని అడిగితే చెల్లుతాయన్నారు. అయినా ఎన్నికల అధికారులు పట్టించుకోకుండా ఏడు ఓట్లతో అధికారపక్షం వాళ్లు గెలిచారని ప్రకటించేశారు. చెల్లని ఓట్లను ఎందుకు కలిపారని ప్రశ్నించినా పట్టించుకోలేదు. 80 నుంచి 100 మంది పోలీసులు వచ్చి బెదిరించి బయటకు పంపేశారు’ అని తెలిపారు.

ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన టెంపో వాహనం.. 14 మంది దుర్మరణం

Last Updated : Feb 15, 2021, 3:45 AM IST

ABOUT THE AUTHOR

...view details