ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపాకు ఓటేస్తే సుంకాల మోత: చంద్రబాబు

వైకాపా అధికారంలోకి వచ్చాక అధిక ఆస్తి పన్నుతో ప్రజల నెత్తిన గుదిబండ పడిందని చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక, సిమెంట్, గ్యాస్, డీజల్, పెట్రోల్, వంట నూనెల ధరలు పెరుగుదలతో సామాన్యులపై భారం పడుతోందన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిజిస్టర్ విలువ ఆధారంగా పట్టణాల్లో భారీగా ఆస్తి పన్ను పెంచేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఆస్తి పన్ను పెరగడం వల్ల ఇంటి అద్దెలు పెరిగితే మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పవన్నారు.

By

Published : Mar 2, 2021, 7:53 PM IST

Updated : Mar 3, 2021, 7:12 AM IST

చంద్రబాబు
చంద్రబాబు

వైకాపాకు ఓటేస్తే సుంకాల మోత: చంద్రబాబు

తెదేపా గెలిచిన పురపాలక, నగర పాలక సంస్థల్లో ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్‌ మొదటి సమావేశంలోనే తీర్మానిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పట్టణాలు, నగరాల్లో ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్టర్డ్‌ విలువ ఆధారంగా ఆస్తి పన్ను భారీగా పెంచేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రలను అడ్డుకుంటామన్నారు. పురపాలక ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తే ప్రజలపై పెనుభారం పడుతుందని పేర్కొన్నారు. ఆయన మంగళవారం పురపాలక ఎన్నికలపై పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇంతవరకు అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేస్తుండగా, రిజిస్ట్రేషన్‌ విలువ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను పెరిగేలా జగన్‌రెడ్డి చట్టం తీసుకొచ్చారని ఆయన ధ్వజమెత్తారు.

'కొత్త చట్టం ప్రకారం నివాస భవనాలకు రిజిస్ట్రేషన్‌ విలువలో 0.5 శాతం వరకు పన్ను విధిస్తారు. ఒక భవనం రిజిస్టర్డ్‌ విలువ అది ఉన్న స్థలంతో కలిపి రూ.కోటి ఉందనుకుంటే.. దానికి ఏప్రిల్‌ 1 నుంచి ఏడాదికి రూ.50వేల వరకు ఆస్తి పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఆ ఇంటికి రూ.లక్షన్నర అద్దె వస్తుంటే.. ఇప్పటివరకు రూ.5వేలు మాత్రమే పన్ను వేస్తున్నారు. కొత్త చట్టం ప్రకారం వాణిజ్య భవనాలకు రిజిస్టర్డ్‌ విలువలో 2 శాతం పన్ను విధిస్తారు. ఒక భవనం విలువ రూ.కోటి ఉంటే.. రూ.2 లక్షల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇదే భవనానికి ప్రస్తుతం రూ.10వేల నుంచి రూ.15వేల వరకు పన్ను ఉంది. ఖాళీ స్థలం ఉంటే దాని విలువలో మున్సిపాలిటీల్లో 0.2 శాతం, కార్పొరేషన్లలో 0.5 శాతం పన్ను చెల్లించాలని నిబంధన పెట్టారు. ఖాళీ స్థలం విలువ రూ.కోటి ఉంటే.. మున్సిపాలిటీల్లో రూ.20 వేలు, కార్పొరేషన్లలో రూ.50 వేల పన్ను కట్టాల్సి వస్తుంది. దానిలో చెత్త ఉంటే దీనికి అదనంగా మున్సిపాలిటీల్లో రూ.10 వేలు (0.1శాతం), కార్పొరేషన్‌లో రూ.25 వేలు (0.25 శాతం) కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం రుణ పరిమితి పెంచుకోవడానికి ప్రజలపై భారం వేయడం సిగ్గుచేటు’ అని చంద్రబాబు మండిపడ్డారు.

పేదలను వేధించడం కాదా?
'గతంలో పన్ను వేయని భవనాలు, ఖాళీ స్థలాలకు కొత్త విధానంలో రిజిస్టర్డ్‌ విలువ ఆధారంగా పన్ను వేసేలా జగన్‌రెడ్డి కొత్త చట్టం తెచ్చారు. 375 అడుగులకన్నా ఎక్కువ నిర్మిత ప్రాంతం కలిగిన భవనాల్లో ఉంటున్న పేద, మధ్యతరగతి ప్రజలు కూడా రిజిస్టర్డ్‌ విలువ ఆధారంగా పన్ను చెల్లించేలా చట్టం తేవడం ప్రజలను వేధించడం కాదా? అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు ఉన్నవారూ రిజిస్టర్డ్‌ విలువ ఆధారంగా పన్ను చెల్లించాలనడం మధ్యతరగతిపై భారం కాదా? పేదలు అనధికారికంగా ప్రభుత్వ, మున్సిపల్‌, ఎండోమెంట్‌, వక్ఫ్‌ భూముల్లోగానీ, ఇతర పబ్లిక్‌ ప్రదేశాల్లోగానీ ఇల్లు కట్టుకుంటే.. ఎలాంటి పట్టా, పత్రం లేకపోయినా 100 శాతం అదనపు పన్ను విధించడం కక్ష సాధింపునకు నిదర్శనమే’ అని మండిపడ్డారు.

మీకు అండగా ఉంటా..
'తెదేపా కార్యకర్తల ఇళ్లలో వైకాపావారే మద్యం సీసాలు పెట్టి కేసులు పెట్టడానికీ వెనుకాడరు. గతంలో తెనాలిలో అలాగే చేశారు. తెదేపా శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలి. వైకాపా బెదిరింపులకు భయపడి నామినేషన్లు వెనక్కు తీసుకోవడం పిరికిచర్య. అందరూ ధైర్యంగా పోరాడాలి. ఎక్కడైనా సమస్య ఏర్పడితే నేనే వచ్చి అండగా ఉంటా’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

5న మళ్లీ చిత్తూరుకు చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 4వ తేదీ నుంచి వరుసగా 5 రోజులపాటు పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని పార్టీ శ్రేణులు తెలిపాయి. ‘4న కర్నూలు, 5న చిత్తూరు, 6న విశాఖ, 7న విజయవాడ, ఎనిమిదో తేదీన గుంటూరులో చంద్రబాబు పర్యటించనున్నారు. తెదేపా అభ్యర్థుల విజయం కోసం ఆయా ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:

పురపాలక ఎన్నికలకు తొలగిన న్యాయపరమైన అవరోధాలు

Last Updated : Mar 3, 2021, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details