నెల్లూరు జిల్లా కావలిలో కరుణాకర్ అనే ఎస్సీ యువకుడి మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. బలహీనవర్గాలు, ఎస్సీలపై రాష్ట్రంలో దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసునూరులో చేపల చెరువులు సబ్ లీజుకు తీసుకుని వ్యాపారం చేసుకుంటున్న కరుణాకర్ను వైకాపా నేతలు జగదీశ్వరరెడ్డి, సురేశ్రెడ్డి చేపలు పట్టుకోనీయకుండా వేధించారని పేర్కొన్నారు. అందుకే కరుణాకర్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. ఎస్సీలపై దాడి చేసిన వారి పట్ల పోలీసుల ఉదాసీనత కారణంగానే నిందితులు బరితెగిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఏం జరిగిందంటే..: వైకాపా నేతల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ దళిత యువకుడు శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే, వాటిని పట్టుకోకుండా అడ్డుపడుతున్నారని, తనతోపాటు తన తల్లినీ వేధించారని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కావలి పట్టణం ముసునూరు ఎస్సీకాలనీకి చెందిన దుగ్గిరాల కరుణాకర్(36) చేపల చెరువును సబ్ లీజుకు తీసుకొని మత్స్య వృత్తితో జీవనం సాగిస్తున్నారు. రెండేళ్లుగా వరదలు, వర్షాల కారణంగా చేపలు కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.