విలీన గ్రామాల ప్రజలు నమ్మకం కోల్పోయారు: చంద్రబాబు - తెదేపా నేత చంద్రబాబు
Chandrababu: రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడం వల్లనే తెలంగాణలో కలపాలని విలీన గ్రామాల ప్రజల డిమాండ్ చేస్తున్నారని.. తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 14 రోజులుగా కరెంట్, నీరు లేక వరద బాధిత ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన చెందారు.

Chandrababu: జగన్ ప్రభుత్వంపై నమ్మకంలేకే విలీన గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. విలీన మండలాల్లో విద్యుత్తు సరఫరా లేక, తాగడానికి నీళ్లులేక ప్రజలు అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నారని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘వరదతో వచ్చిన బురదను, రహదారులపై కూలిన చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. వారం క్రితమే వరదలు తగ్గాయని ప్రకటనలు చేసిన మంత్రులు ఇప్పటికీ విద్యుత్తు సరఫరా, రాకపోకలను ఎందుకు పునరుద్ధరించలేకపోయారో చెప్పాలి. వరద బాధితులకు కనీస సాయం అందక ఎటపాక మండలంలోని ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండు చేస్తున్నారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు వేసిన ప్రశ్నలపై ఎదురుదాడి మాని ప్రజల వద్దకు వెళ్తే వాస్తవాలు తెలుస్తాయని హితవు పలికారు. ‘వరదలకు చనిపోయిన పశువుల కళేబరాల దుర్గంధం, దోమలు, ఇళ్లలోకి చేరిన విష సర్పాలతో నిద్రాహారాలు లేకుండా గడుపుతున్న బాధిత ప్రజల వేదనను తెలుసుకోండి. ప్రభుత్వ పెద్దలు గాల్లో పర్యటనలు, గాలి మాటలు పక్కన పెట్టి యుద్ధ ప్రాతిపదికన వరద ప్రాంతాల సమస్యలను పరిష్కరించాలి’ అని చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు. సాయం అందకపోవడంతో ఆగ్రహించిన వరద బాధితులు కలెక్టరు కారును అడ్డగించడంపై ‘ఈనాడు’లో వచ్చిన కథనాన్ని ఆయన ట్వీట్కు జత చేశారు.