ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Mining News: 'పర్యావరణానికి ముప్పు కలిగేలా ఏపీలో మైనింగ్'.. గనులశాఖ లేఖ - central minister on illegal beach sand mining at ap

పర్యావరణానికి ముప్పు కలిగేలా ఏపీలో మైనింగ్ జరుగుతోందని.. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని రాష్ట్రాన్ని ఆదేశించినట్లు డీవోపీటీ శాఖ మంత్రి జితేంద్రర్​సింగ్​ తెలిపారు.

ఏపీలో బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో అక్రమాలు
ఏపీలో బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో అక్రమాలు

By

Published : Mar 16, 2022, 10:53 PM IST

Updated : Mar 17, 2022, 4:53 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో బీచ్‌శ్యాండ్‌ మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర అణు ఇంధన, ప్రధానమంత్రి కార్యాలయశాఖల మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. ‘ఏపీలో 14 బీచ్‌శ్యాండ్‌ ఏరియాలకు ప్రాస్పెక్టివ్‌ లెస్సీగా అనుమతి ఇవ్వాలన్న ఏపీఎండీసీ వినతిని కేంద్రం పరిగణనలోకి తీసుకుందా? ఒకవేళ అనుమతిచ్చి ఉంటే కాల పరిమితి ఎంత? ఇవ్వకపోతే కారణాలేంటి?’ అని వైకాపా ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కురువ గోరంట్ల మాధవ్‌ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో 18,367 హెక్టార్ల పరిధిలో ఉన్న బీచ్‌శ్యాండ్‌ మినరల్స్‌కు ఏపీఎండీసీని ప్రాస్పెక్టివ్‌ లెస్సీగా నామినేట్‌ చేస్తూ రాష్ట్రం నుంచి కేంద్ర అణు ఇంధనశాఖకు 17 ప్రతిపాదనలు వచ్చాయి. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని 90.15 హెక్టార్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని 1,978.471 హెక్టార్లలోని బీచ్‌శ్యాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌ లీజులు మంజూరు చేయడానికి ఏపీఎండీసీని ప్రాస్పెక్టివ్‌ లెస్సీగా నామినేట్‌ చేస్తూ కేంద్ర అణు ఇంధనశాఖ 2021 మార్చి 25, ఏప్రిల్‌ 15 తేదీల్లో ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం మైనింగ్‌ లీజు ముందస్తు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2021 మే 6న కేంద్రానికి లేఖ రాసింది. అందులో పేర్కొన్న అంశాలపై అదనపు సమాచారం కోరుతూ కేంద్ర గనులశాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఆంధ్రప్రదేశ్‌కు లేఖ రాసింది. దానికి ఏపీ నుంచి ఇంతవరకు ఎలాంటి బదులూ రాలేదు. పర్యావరణానికి జరుగుతున్న నష్టం, మైనింగ్‌ చట్టాల ఉల్లంఘన, మోనోజైట్‌ రహస్య ఎగుమతుల ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర గనులశాఖ 2021 జూన్‌ 11న రాసిన లేఖను దృష్టిలో ఉంచుకొని మిగిలిన ప్రతిపాదనల పరిశీలన ప్రక్రియను నిలిపేశాం. ఈ అంశాలపై దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ను కోరాం. ఆంధ్రప్రదేశ్‌ అందించిన సమాచారం ఆధారంగా అణు ఇంధనశాఖ మరింత సమాచారం కోరుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 3న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ సమాచారాన్ని ఏపీ ఇప్పటికీ సమర్పించలేదు’ అని జితేంద్రసింగ్‌ వివరించారు.

Last Updated : Mar 17, 2022, 4:53 AM IST

ABOUT THE AUTHOR

...view details