జడ్జీలపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యల (comments on judges) కేసులో సీబీఐ ఛార్జిషీట్లు (CBI chargesheet) నమోదు చేసింది. పోస్టులు పెట్టిన మరో ఆరుగురిపై వేర్వేరుగా ఛార్జిషీట్లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎ. శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, జి.శ్రీధర్ రెడ్డి, సుశ్వరం శ్రీనాథ్, దరిష కిషోర్ రెడ్డి, సుద్దులూరి అజయ్ అమృత్పై ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. అనుచిత పోస్టుల కేసులో గతంలో ఐదుగురితో పాటు మొత్తం 11 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. పంచ్ ప్రభాకర్ (Punch prabakar) సహా విదేశాల్లోని నిందితులను అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. నిందితులకు ఇంటర్ పోల్ (Interpoll) ద్వారా బ్లూ నోటీసు (Blue notice) జారీ చేసినట్లు సీబీఐ అధికారులు వివరించారు.
సీబీఐకి హైకోర్టు డెడ్ లైన్..
న్యాయవ్యవస్థ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన నిందితుడు పంచ్ ప్రభాకర్ను (Punch prabakar) పది రోజుల్లో అరెస్టు చేయాలని సీబీఐకి హైకోర్టు (AP High Court) ఈనెల 2న తుది గడువు ఇచ్చింది. దర్యాప్తు సరైన రీతిలో సాగుతోందని సదుద్దేశాన్ని రుజువు చేసుకోవాలని, అందులో విఫలమైతే మీకు దర్యాప్తు చేతకావడం లేదని భావించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తామని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరుతూ నివేదిస్తామని వెల్లడించింది. దర్యాప్తుపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్ను (CBI Director) ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈనెల 2న ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. అనంతరం విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.