ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాగ్రత్తలు పాటిద్దాం... కొవిడ్​ను తరిమేద్దాం

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్​ పట్ల అవగాహన కల్పిస్తూ... కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కొవిడ్​ పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... వైరస్​ను తరిమికొట్టాలనే నినాదంతో వీధులు మారుమోగాయి.

By

Published : Oct 31, 2020, 12:56 AM IST

candle rally for awareness on coronavirus
జాగ్రత్తలు పాటిద్దాం... కొవిడ్​ను తరిమేద్దాం

ఈ నెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైరస్​పై విస్తృతంగా అవ‌గాహ‌న కార్యక్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. కొవిడ్-19 పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ...శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్, ప్రమాదవశాత్తు వ్యాధి బారిన పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

కృష్ణా జిల్లాలో...

కరోనాపై అవగాహన కల్పించేందుకు విజయవాడంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బెంజ్ సర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ర్యాలీగా వెళ్లారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ సీపీ బి. శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న, ఆశా వర్కర్లు, ఏఎన్​ఎంలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ సూచించారు.

కొవ్వొత్తుల ర్యాలీ

కొవిడ్​పై అవగాహన కల్పిస్తూ.. ఆశావర్కర్లు, ఆరోగ్యశాఖ ఉద్యోగులతో కలిసి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. విజయవాడని గొల్లపూడి ప్రదాన కూడలి నుంచి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైరస్ పట్ల కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తూ... కొవిడ్ నివారణకు ప్రజలంతా సహకరించాలని కోరారు.


తిరుపతిలో...

అజాగ్రత్తగా ఉన్నా.. నిర్లక్ష్యం వహించినా కొవిడ్-19 ప్రమాదం తప్పదని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషా హెచ్చరించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి నాలుగుకాళ్ల మండపం... అక్కనుంచి తిరిగి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అన్‌లాక్‌ నేపథ్యంలో ప్రజా రవాణాతో పాటు ఇతర కార్యకలాపాలన్నీ సాధారణ స్థితికి వచ్చాయని... వ్యాధిపట్ల ఇప్పుడే మరింత అప్రమత్తత అవసరముందన్నారు. ఈ ర్యాలీలో కమిషనర్‌తో పాటు నగరపాలక సిబ్బంది, ఆరోగ్యశాఖ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో

తణుకులో కరోనా నివారణ కేంద్రాల వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తణుకు పురపాలక సంఘ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి మీదుగా నరేంద్ర కూడలి వరకు సాగిన ర్యాలీలో కొవిడ్-19 పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్క్ పెట్టు- కరోనా వైరస్ ఆటకట్టు, భౌతిక దూరం పాటించు, చేతులు శుభ్రం చేసుకో వంటి నిబంధనలు గుర్తుచేస్తూ.... నినాదాలు చేశారు. ఈ కొవిడ్ అవగాహన ర్యాలీలో కరోనా నివారణ కేంద్రాల వైద్యులు, సిబ్బందితో పాటు మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ
జన చైతన్యం ద్వారా కరోనా వైరస్​ను తరిమికొట్టాలని పి.గన్నవరం ఎంపీడీవో పీ చక్రధరరావు అన్నారు. కొవిడ్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని నినాదంతో గన్నవరంలో అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

నెల్లూరులో...

కరోనాపై అవగాహన కల్పించేందుకు ఉదయగిరిలో అధికారులు కొవ్వొత్తులతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం నుంచి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. బస్టాండ్ కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ కట్టడికి ప్రజల చైతన్యం అవసరమని ఎంపీడీవో వీరాస్వామి అన్నారు. వైరస్ నియంత్రణకు సమాజంలో ప్రతి ఒక్కరూ తమ సహకారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ మస్తాన్ వలి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ

శీకాకుళం జిల్లాలో..

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కే కవచమని శ్రీకాకుళం జిల్లా జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. పది రోజులుగా కొవిడ్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. అందులో భాగంగానే శ్రీకాకుళంలో ఏడు రోడ్ల కూడలి నుంచి సూర్యమహల్‌ కూడలి వరకు భారీగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని జేసీ కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, వ్యాపార వర్గాలు, ప్రజలు ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు.

ఆమదాలవలస పట్నంలో శ్రీకాకుళం ఆర్టీవో, ఆమదాలవలస మున్సిపల్ ప్రత్యేకాధికారి కిషోర్ ఆధ్వర్యంలో... కరోనా వైరస్​ అవగాహనపై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం నుంచి రైల్వే స్టేషన్, జూనియర్ కళాశాల, తహసీల్దార్ కార్యాలయం మీదుగా ర్యాలీ చేపట్టారు. కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులలు సూచించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. అవసరమైతే బయటకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం రవి సుధాకర్, తహసీల్దార్ గురుగుబెల్లి శ్రీనివాసరావు, ఎంపీడీవో పెడాడ వెంకటరాజు, రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ జె వెంకటేశ్వరరావు, ఇతరు సిబ్బంది పాల్గొన్నారు.

తూర్పుగోదావరిలో...

కొవిడ్‌-19 వ్యాప్తిని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ పరచాలనే ఉద్దేశంతో క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. క‌లెక్ట‌రేట్‌లో ప్రారంభించిన కొవ్వొత్తుల ర్యాలీ జీజీహెచ్ వ‌ర‌కు కొనసాగింది. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వ‌ర‌కు ప‌ది రోజుల పాటు జిల్లావ్యాప్తంగా విస్తృత అవ‌గాహ‌న కార్యక్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వ‌ర‌కు రోజుకో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. ఈ సందర్బంగా గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బంది కీలక పాత్ర పోషించార‌న్నారు.

మాస్కు ధ‌రించ‌డం, భౌతిక‌దూరం, పాటించ‌డం, చేతుల‌ను స‌బ్బుతో శుభ్ర‌ప‌ర‌చుకోవ‌డం.. వంటి చిన్న చిట్కాల‌తో క‌రోనా బారిన‌ప‌డ‌కుండా చూడొచ్చ‌ని పేర్కొన్నారు. ఈ విష‌యాన్నినిర్ల‌క్ష్యం చేయ‌కుండా, జాగ్రత్త‌గా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

న‌వంబ‌ర్ 2న పాఠ‌శాలలు ప్రారంభంకానున్న‌నేప‌థ్యంలో విద్యార్థుల త‌ల్లిదండ్రులు అప్ర‌మ‌త్తంగా ఉంటూ... త‌మ పిల్ల‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. జిల్లాలో ఒక‌ట్రెండు మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయ‌ని... ఈ మ‌ర‌ణాల సంఖ్య‌నూ సున్నాకు చేర్చే ల‌క్ష్యంతో వైద్యా ఆరోగ్యశాఖ సిబ్బంది కృషి చేయాల‌ని సూచించారు. ఈ ర్యాలీలో పలువురు జిల్లా అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్య‌క‌ర్త‌ల‌ు, త‌దిత‌రులు పాల్గొన్నారు

కొవిడ్-19 పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. వైరస్ నివారణపై అవగాహన కల్పిస్తూ... అమలాపురం గడియార స్తంభం నుండి హైస్కూల్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని మంత్రి విశ్వరూప్ సూచించారు. ఈ ర్యాలీలో సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, తదితరులు పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ

అనంతపురంలో..

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సూచించారు. మాస్కే కవచం నినాదంతో వైద్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ప్రభుత్వ అధికారులు కొవ్వొత్తులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. దుకాణాల్లో మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ నినాదాలతో వైఎస్సార్ సర్కిల్ వద్ద అధికారులు ప్రతిజ్ఞ చేయించారు.

హిందూపురం పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పట్టణ వాసులకు కరోనా వైరస్ పట్ల అభద్రతాభావం ఏర్పడిందని.. వారిని చైతన్యపరిచే దిశగా ర్యాలీ నిర్వహిస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. మాస్కులు, శానిటేషన్, భౌతిక దూరం పాటిస్తే వైరస్ బారినుంచి బయటపడొచ్చాన్నారు. మాస్కు ధరించి కరోనా వైరస్​కు దూరంగా ఉండాలి అనే నినాదాలతో పట్టణంలోని ప్రధాన కూడళ్ల మారుమోగాయి. ఈ ర్యాలీలో మున్సిపల్ సిబ్బంది, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు

ABOUT THE AUTHOR

...view details