విజయనగరం జిల్లాలో...
భాజపా చేపట్టిన ఛలో రామతీర్థం పిలుపుతో భాజపా, జనసేన శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నుంచే నిరసన కారులు పెద్ద సంఖ్యలో రామతీర్థం, పరిసర గ్రామాలకు చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. పరిసర గ్రామాల్లో పోలీసు పహారా కొనసాగుతోంది.
ఛలో రామతీర్ధం కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులను మోహరించారు. రామతీర్థం వెళ్లే భాజాపా, జనసేన ముఖ్య నేతలను పోలీసులు అరెస్టులు చేశారు. దీంతో ఆ పార్టీల నేతలు ప్రభుత్వ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థంలో రామున్ని దర్శించుకునేందుకు వెళ్తున్న తమను అడ్డుకొని అరెస్టులు చేయడం సరికాదన్నారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టును నిరసిస్తూ.. పార్వతీపురంలో పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుర గాల ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ధర్మ యాత్ర చేపట్టాలనుకున్న నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని.. వీర్రాజును తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లాలో..
రామతీర్థం కొండపైకి భాజపా నేతలను అనుమతించకపోవడం దారుణం అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పోలీసులు, ప్రభుత్వం వైఫల్యంతోనే దేవాలయాలపై వరుస ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని.. దీనికి నిరసనగా తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమ పార్టీ నేతలను గృహ నిర్బంధాలు, అరెస్ట్ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లాలో
రామతీర్థం ఘటన హేయమైన చర్య అని జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. రామతీర్థం వెళ్తున్న భాజపా, జనసేన నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పాలన చేయాల్సిన మంత్రులు ప్రతిపక్షలపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ధర్మవరంలో జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. విగ్రహాల ధ్వంసం ఘటనలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం ఆలయాల రక్షణలో విఫలమైందని.. ప్రజలు తగిన సరైన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు.
ప్రకాశం జిల్లాలో
ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. చినగంజాంలో భాజపా, జనసేన ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దాడులకు పాల్పడ్డ వాళ్లపై చర్యలు తీసుకోవాలని. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.