ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్షక పోరుకు కృష్ణా జిల్లాలో సంపూర్ణ మద్దతు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌.. కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, విద్యాసంస్థలు మూసివేశారు. జాతీయ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాజకీయ పార్టీలు, ఉద్యోగ, కార్మిక, ప్రజాసంఘాలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించడంతో పాటు.. ఆందోళనల్లో పాల్గొన్నాయి.

By

Published : Dec 8, 2020, 10:47 AM IST

Updated : Dec 8, 2020, 6:20 PM IST

bharath-band-in-krishna-district
bharath-band-in-krishna-district

కర్షక పోరుకు కృష్ణా జిల్లాలో సంపూర్ణ మద్దతు

కృష్ణా జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగించింది. రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ వామపక్ష పార్టీలు, కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

విజయవాడలో

కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆప్‌, రైతుల సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో రాస్తారోకో చేపట్టారు. సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత మధు, ఇతర నేతలు రోడ్లపై బైఠాయించారు. బంద్‌కు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. భారత్‌ బంద్‌కు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, దళిత సంఘాల మద్దతు ప్రకటించాయి.

పెనమలూరులో

పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు, పోరంకి, కంకిపాడు, ఉయ్యూరు గ్రామాల్లో బంద్‌ ప్రభావం కనిపించింది. ఉదయం నుంచి ప్రభుత్వ రవాణా పూర్తిగా నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

నందిగామలో

నందిగామలో భారత్​ బంద్​ ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపారులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలను స్వచ్ఛందంగా మూసివేసి అధికారులు బంద్​కు సహకరించారు. అన్ని విద్యా సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. వామపక్షాలు, కాంగ్రెస్, బహుజన సమాజ్ వాది పార్టీ, రైతు సంఘాలు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.

పామర్రు నియోజకవర్గంలో

పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలంలో భారత్ బంద్​కు మద్దతుగా కూచిపూడి మొవ్వ సెంటర్​లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

నూజివీడులో

దిల్లీలో రైతులు తలపెట్టిన నిరసన దీక్షలకు సంఘీభావంగా అఖిలపక్ష నేతలు నూజివీడులో నిరసన చేశారు. ప్రభుత్వం బంద్​కు మద్దతు తెలపడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. తెలుగుదేశం, వామపక్షాలు, కాంగ్రెస్, పలు ప్రజా సంఘాలకు చెందిన నేతలు నూజివీడు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నిరసన చేశారు.

దివిసీమలో

దివిసీమలో భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దివిసీమలో ప్రశాంత వాతావరణంలో బంద్ నిర్వహించారు. వామపక్షాలు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసన చేశారు. దుకాణాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతబడ్డాయి.

ఇతర ప్రాంతాల్లో

కృష్ణాజిల్లా మైలవరం, హనుమాన్ జంక్షన్, పెనుగంచిప్రోలులో భారత్​ బంద్ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, రైతుసంఘాలు, వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి.

ఇదీ చదవండి:రైతు భవిత పరాధీనం- అందుకే అన్నదాత ఆగ్రహం!

Last Updated : Dec 8, 2020, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details