రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు(banks) అనేక షరతులు, నిబంధనలను విధిస్తున్నాయి. ప్రభుత్వాలు గ్యారంటీగా ఉండి వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు సమీకరించి వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేసేవి. ప్రభుత్వ రెవెన్యూ(revenue) రాబడి మొత్తంలో 90 శాతానికి మించకుండా రుణాలు సమీకరించుకునే వీలుండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వ గ్యారంటీలు మాత్రమే చూపిస్తే రుణాలు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు ససేమిరా అంటున్నాయి. ఇందుకు ఇతరత్రా రూపాల్లో తనఖాలు, భరోసాలు కోరుకుంటున్నాయి. తాజా ఉదంతాలూ ఇందుకు నిదర్శనం.
10% ఆస్తుల తాకట్టు.. చెల్లింపులకూ ప్రత్యేక ఆదాయం
రుణ సంస్థలు ప్రభుత్వానికి అప్పు ఇవ్వాలంటే గ్యారంటీలతోపాటు అదనంగా ఆస్తులు తనఖా పెట్టాలని నిబంధన విధిస్తున్నాయి. మొత్తం రుణం విలువలో 10% ఆస్తులు తనఖా పెట్టాలంటున్నాయి. రుణాల చెల్లింపునకు ఉన్న ఆదాయ మార్గాలను తమకు చూపించాలని షరతు విధిస్తున్నాయి. దీంతో ఒక ప్రత్యేక ఆదాయాన్ని ప్రభుత్వం వారికే నేరుగా చెల్లించేలా ఎస్క్రో చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ నుంచి రుణ సమీకరణ ప్రారంభించారు. ఇందుకు 10 మద్యం డిపోల నుంచి అదనపు ఎక్సైజ్ సుంకాన్ని బ్యాంకులకు చెల్లించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఆస్తులనూ తనఖా పెట్టారు. ఈ కార్పొరేషన్ ద్వారా వచ్చే అప్పు అంతా సంక్షేమ కార్యక్రమాలకే.. అంటే నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసే పథకాలకే మళ్లిస్తున్నారు. అంటే.. అది ఆస్తిని సృష్టించడం లేదు.
రోడ్డు రవాణా కార్పొరేషన్కు ఇలా..
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు రూ.2,000 కోట్లతో పనులు చేపట్టాలని ప్రభుత్వం(govt) నిర్ణయించింది. ఇందుకు వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పు తీసుకునేందుకు రోడ్డు రవాణా కార్పొరేషన్ను ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం పెట్రోలు, డీజిల్పై లీటరుకు రూపాయి సెస్గా విధించి అందులో 50% విలువను ఆర్థిక సంస్థలకు ఎస్క్రోగా చూపించవ్చని తెలిపింది. ఆ నిధులను నేరుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకే వినియోగించేలా భరోసా కల్పించి ఈ పనులను చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కార్పొరేషనూ ఆస్తుల తనఖా ప్రయత్నాలు ప్రారంభించింది.