Thalassemia Day: పిల్లల్లో వచ్చే ప్రాణాంతక వ్యాధి తలసేమియా. బిడ్డ పుట్టిన నెలల వ్యవధిలోనే బయటపడే ఈ వ్యాధి వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారుతోంది. కొందరికి నెలకు మూడుసార్లు రక్తమార్పిడి చేస్తేకానీ బతికే పరిస్థితి ఉండదు. పిల్లల భవిష్యత్తు వారి తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన పెంచుతోంది. రోజువారీ కూలీపనులు చేసుకునేవారి కుటుంబాల్లోనే అధికంగా తలసేమియా బాధితులు ఉన్నారు. పిల్లల వైద్యం కోసం నెలకు కనీసం పదివేలు రూపాయలు ఖర్చవుతోంది. రక్తదాతల కోసం తిరగాల్సివస్తోంది. తలసేమియా వ్యాధి బారినపడ్డ పిల్లలు చురుగ్గా ఉండలేకపోవడం, త్వరగా నీరసించడాన్ని.. తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. మిగతా పిల్లల్లా... వయసుకు తగ్గట్లు ఎదగకపోవడం కూడా తల్లిదండ్రును మరింత కుంగుబాటుకు గురిచేస్తోంది.
Thalassemia Day: 'తలసేమియా'ను తరిమేద్దాం.. వ్యాధిపై అవగాహన కార్యక్రమం - awareness on thalassemia
Awareness on thalassemia at Vijayawada: పిల్లలు పెరిగే కొద్దీ తల్లిదండ్రులకు సంతోషం రెట్టింపవుతుంది. కానీ తలసేమియా వ్యాధిబారిన పడ్డ పిల్లలతో కంగారు అధికమవుతోంది. వారికి అవసరమైనప్పుడల్లా రక్తం ఎక్కించేందుకు కాళ్లరిగేలా ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సివస్తోంది. ఈ వ్యాధి కన్నా.. దాని పట్ల ఉన్న ఆందోళన వారిని మరింత మనోవేదనకు గురిచేస్తోంది. నేడు తలసేమియా దినాన్ని పురస్కరించుకొని.. శనివారం విజయవాడలో సప్త ఫౌండేషన్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. బాధిత బాలల తల్లిదండ్రుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది.

తమ బాబుకు ఏడాదిన్నర వచ్చేవరకూ తలసేమియా ఉన్నట్లు గుర్తించలేదని.. అమలాపురానికి చెందిన పరుశురాం తెలిపారు. అప్పులు చేసి మరీ వైద్యం చేయించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రపంచ తలసేమియా దినం పురస్కరించుకుని బాధితులు, తల్లిదండ్రుల్లో ధైర్యం నింపేందుకు విజయవాడలో శనివారం ఓ కార్యక్రమం నిర్వహించారు. వ్యాధి నివారణ, వైద్యం సహా అనేక అంశాలపై చర్చించారు. సప్త ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు తోడ్పాటుగా నిలుస్తున్నాయని.. తలసేమియా బాధిత బాలల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
- ఇదీ చదవండి: శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి