విజయవాడ గురునానక్కాలనీకి చేరువలోని కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ వద్ద ఉదయం పది గంటల సమయంలో.. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తన నివాసం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు కారులో పయనమయ్యారు. ఇంటి నుంచి 200 మీటర్ల దూరంలోపు మలుపు తిరిగి కారు స్పీడ్ బ్రేకర్ వద్ద నిదానంగా ముందుకు వస్తున్న క్రమంలో.. అంబేడ్కర్ పార్కు వైపునుంచి ఒక్క ఉదుటన గుర్తుతెలియని దుండగులు కారు వద్దకు దూసుకెళ్లారు. తమవద్ద ఉన్న మారణాయుధాలతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఆ తర్వాత పట్టాభిరామ్, అతని డ్రైవరుపైనా దాడికి దిగారు. పట్టాభిరామ్ చేతులు, కాళ్లకు బలంగా గాయాలయ్యాయి. అతని చేతిలోని సెల్ఫోన్ విరిగిపోయింది.
ఈ దాడిని చూసి.. చుట్టుపక్కల వారు గట్టిగా కేకలు వేసేసరికే... దుండగులు ద్విచక్ర వాహనాలపై అక్కడి నుంచి జారుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు బయటకొచ్చాయి. ప్రణాళిక ప్రకారమే అదును చూసి... మాటు వేసి దాడి చేసినట్టు స్పష్టంగా కనిపించింది. తొలుత ముగ్గురు వ్యక్తులు దాడి చేయగా... ఆ తర్వాత మరో వ్యక్తి రాళ్లతో కారుపై దాడి చేసినట్లు కనిపిస్తోంది. పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు పట్టాభి ఉదయం ఇంటి నుంచి బయటకొస్తారని తెలుసుకుని అందుకు అనుగుణంగా పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. నాలుగు నెలల కాలంలో పట్టాభిపై తన ఇంటి వద్ద దాడి ఇది రెండోసారి. గతేడాది అక్టోబరు నాలుగో తేదీన మొదట దాడి జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
వారం రోజుల క్రితం పట్టాభిపై దాడికి పథక రచన చేస్తోన్నట్లు వచ్చిన సమాచారంతో తెలుగుదేశం పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించారు. వ్యక్తిగతంగా తగిన భద్రత చర్యలు తీసుకోవాలని పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. ఇంతలోనే పక్కా వ్యూహంతో తనపై దాడి జరిగిందని పట్టాభిరామ్ అన్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే ఈ తరహా చర్యలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను బయటపెడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని... గత పదిరోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయన్నాయని చెప్పారు. తనకు రక్షణ కల్పించాలని మీడియా ముఖంగా కోరానని... అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మంత్రులు, హైకోర్టు జడ్జిలు, ప్రముఖులు ఉండే ఇలాంటి ప్రాంతంలో మారుణాయుధాలతో దాడులు జరుగుతుంటే.. రాష్ట్రంలో శాంతిభద్రలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. పట్టాభిపై దాడి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు.