ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Govt Employees on Fitment: ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత: సజ్జల

By

Published : Dec 15, 2021, 8:36 PM IST

Updated : Dec 16, 2021, 4:52 AM IST

ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత: సజ్జల
ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత: సజ్జల

20:30 December 15

ఉద్యోగ సంఘాలతో ముగిసిన ప్రభుత్వం చర్చలు

ఉద్యోగులతో చర్చలు జరిపిన ప్రభుత్వం

ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ప్రభుత్వం జరిపిన మలివిడత చర్చలు కూడా అసంపూర్తిగా ముగిశాయి. అధికారుల కమిటీ సిఫార్సులపై సచివాలయంలో ఆర్ధిక మంత్రి బుగ్గన నేతృత్వంలో చర్చలు జరపాలని ప్రభుత్వం యత్నించినా.. వేతన సవరణ సంఘం నివేదికలోని అంశాలపైనే చర్చిస్తామని ఉద్యోగ సంఘాలు తెగేసి చెప్పటంతో ప్రభుత్వం ఆయా అంశాలపై చర్చలను ప్రారంభించింది. ఆరుగంటలపాటు చర్చలు సాగినా ఫిట్ మెంట్ విషయమై ప్రభుత్వం-ఉద్యోగ సంఘాల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. మరోవైపు ఉద్యమాన్ని వాయిదా వేయాలంటూ ప్రభుత్వం అప్పీలు చేసినా ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇచ్చేంత వరకూ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాలు తేల్చి చెప్పాయి.

పీఆర్సీ నివేదికలోని 20 అంశాలపై ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపింది. తొలుత అధికారుల కమిటీ సిఫార్సులపై చర్చించేందుకు ప్రయత్నించినా ఉద్యోగులు ససేమిరా అనటంతో పీఆర్సీ నివేదికలోని అంశాల ఆధారంగా చర్చలు ఆరంభమయ్యాయి. అయితే పీఆర్సీ ఫిట్​మెంట్ సహా కొన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేకపోవటంతో చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. చర్చలు జరుగుతున్న దృష్ట్యా ఉద్యమాన్ని వాయిదా వేయాలంటూ ప్రభుత్వం సూచించినా ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాలు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోరాయి.

దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే పీఆర్సీతో పాటు 71 డిమాండ్లపై లిఖిత పూర్వక హామీ ఇచ్చేంత వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. అయితే 11 వ పీఆర్సీ అమలుకు సంబంధించి పీఆర్సీ నివేదికలో అధికారుల కమిటీ సూచించిన అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చించినట్లు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘పీఆర్‌సీపై అధికారులు కమిటీ ఇచ్చిన సిఫార్సులపై చర్చించాం. నిన్న అనధికారికంగా.. ఇవాళ అధికారికంగా చర్చలు జరిపాం. ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అంశాలపైనా చర్చ జరిగింది. రూ.1300 కోట్లు అదనంగా భరిస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. రెండేళ్లుగా 27 శాతం ఐఆర్‌ ఇస్తూ వచ్చాం. ఐఆర్‌ సంరక్షిస్తూనే 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సూచించాం. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి కార్యాచరణకు పిలుపునిచ్చాయి. ప్రస్తుత చర్చల దృష్ట్యా ఉద్యమం వాయిదా వేయాలని కోరాం. సీఎస్‌ ద్వారా హామీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగుల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. ఉద్యోగులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. సమస్యలకు కొన్ని రోజుల్లోనే పరిష్కారం దొరుకుతుంది. సీపీఎస్‌పై నా వ్యాఖ్యలను వక్రీకరించారు. ఉద్యోగ విరమణ తర్వాత భద్రత అంశాన్ని పరిష్కరిస్తాం. రాజకీయ ప్రయోజనాలకు ఉద్యోగ నేతలు లొంగరని భావిస్తున్నాం. మొత్తం సమస్యల పరిష్కారానికి మరో 2 నెలల సమయం పడుతుందని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


మరోవైపు అధికారుల కమిటీ సూచించిన ఫిట్​మెంట్ 14.29 శాతాన్ని అంగీకరించబోమని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. మొత్తం ఆరు గంటలకు పైగా ప్రభుత్వం- ఉద్యోగ సంఘాల మధ్య చ చర్చలు జరిగినా ఏ అంశంపైనా ఏకాభిప్రాయం కుదరలేదు. ఉద్యోగులకు కనీసంగా 34 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాల్సిందిగా కోరినట్టు సచివాలయ ఉద్యోగుల సంఘం కోరింది. హెచ్ఆర్ఏ విషయంలోనూ స్పష్టత కోరినట్టు తెలిపింది. అధికారుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల్లోని చాలా అంశాలను తాము అంగీకరించబోమని ప్రభుత్వానికి తెలిపామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. అటు సీపీఎస్ పైనా ప్రత్యేకంగా చర్చిద్దామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ఇప్పటి వరకూ టీవీ సీరియళ్ల తరహాలో సాగినట్టు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ ఆరోపించారు. అధికారుల కమిటీ ఇచ్చిన సిఫార్సులు ప్రామాణికం కావని ప్రభుత్వానికి తేల్చి చెప్పినట్టు వెల్లడించారు. ఫిట్ మెంట్ విషయంలో ఉద్యోగ సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ పీఆర్సీ నివేదికలోని 20 అంశాలపై అంతా ఒకే తాటిపై నిలబడి ప్రభుత్వానికి తేల్చి చెప్పినట్టు వివరించారు. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 30 శాతం తీసివేయాలన్న ప్రతిపాదన సహేతుకం కాదని స్పష్టం చేశారు. మరోవైపు వచ్చే సోమవారం పీఆర్సీ అంశంపై సీఎం వద్ద శుభం కార్డు పడే అవకాశమున్నట్టు వెల్లడించారు.

ప్రభుత్వంతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని.. అయితే చర్చలు సంపూర్ణం కాలేదని ఏపీ జేఏసీ వ్యాఖ్యానించింది. ఫిట్​మెంట్ పై ప్రభుత్వం ఎలాంటి స్పష్ఠతా ఇవ్వలేదని తెలియచేసింది. మరోమారు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. అధికారం మొత్తం ప్రస్తుతం చర్చలు జరుపుతున్న సజ్జల, బుగ్గన దగ్గర లేదని, సీఎంతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటారని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు కేంద్ర వేతన స్కేలు ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి సంఘం ప్రకటించింది. పీఆర్సీపై అధికారుల కమిటీ దుర్మార్గంగా సిఫార్సులు చేసిందని ఆరోపిచింది. ఫిట్​మెంట్ విషయంలో తాము ఎక్కడా తగ్గలేదని, అన్ని విషయాలపై స్పష్టత వచ్చే వరకు తమ ఉద్యమం యధావిధిగా కొనసాగుతుందని తేల్చి చెప్పింది. హామీ వచ్చేంత వరకు సీఎం వద్ద సమావేశం అయినప్పటికీ నల్లబ్యాడ్జీల తోనే హాజరు అవుతామని నేతలు స్పష్టం చేశారు.

మొత్తం ఆరు గంటలపైటు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపినప్పటికీ అవేవీ ఓ కొలిక్కి రాకపోవటంతో మరోమారు భేటీ కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అంశాలవారీగా ఉద్యోగ సంఘాలు చేసిన ప్రతిపాదనలపై సీఎంతో చర్చించిన అనంతరం మరోమారు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిపించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చదవండి

CS Sameer Sharma On PRC: పీఆర్‌సీపై 3 రోజుల్లోగా సీఎం జగన్‌ నిర్ణయం: సీఎస్‌ సమీర్‌శర్మ

Last Updated : Dec 16, 2021, 4:52 AM IST

ABOUT THE AUTHOR

...view details