ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MAHA PADAYATRA: మహా పాదయాత్రకు పెరుగుతున్న మద్దతు..ఐకాస సంఘీభావ యాత్ర - అమరావతి రైతుల పాదయాత్ర తాజా వార్తలు

అమరావతి రైతులు చేపడుతున్న మహా పాదయాత్రకు సంఘీభావంగా యాత్రలు నిర్వహించాలని అమరావతి మహిళా ఐకాస నిర్ణయించింది. దీనికితోడు వివిధ వర్గాల నుంచి పాదయాత్రకు మద్దతు లభిస్తుండగా.. తాజాగా నటుడు శివాజీ రైతులకు మద్దతు పలికారు.

MAHA PADAYATRA
MAHA PADAYATRA

By

Published : Nov 18, 2021, 4:47 PM IST

Updated : Nov 18, 2021, 5:28 PM IST

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు, మహిళలు నిర్వహిస్తోన్న 45 రోజుల మహా పాదయాత్రకు సంఘీభావంగా యాత్రలు నిర్వహించాలని అమరావతి మహిళా ఐకాస తీర్మానించింది. విజయవాడలోని అమరావతి ఐకాస కార్యాలయంలో ఈ మేరకు రౌండ్​ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ నెల 23న విజయవాడ బీఆర్‌టీఎస్‌ రహదారిలో సంఘీభావ యాత్ర చేయనున్నట్లు ఐకాస ప్రతినిధులు తెలిపారు. అమరావతి రాజధాని కేవలం 29 గ్రామాలకు చెందినదే కాదని.. రాష్ట్ర ప్రజలందరిదీ అనే భావన మహాపాదయాత్రకు ప్రజల నుంచి లభిస్తోన్న స్పందన ద్వారా తెలుస్తోందన్నారు. మహిళలు ఎన్నో త్యాగాలకు ఓర్చి ఈ పాదయాత్ర చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షంతో పాదయాత్రకు విరామం

రాజధాని పాదయాత్రకు మద్దతు ఇస్తున్నవారిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని ఐకాస నేత శివారెడ్డి తప్పుపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా పాదయాత్రకు మద్దతిచ్చారని ఆయనపై కూడా కేసులు పెడతారా అని ప్రశ్నించారు. వర్షం కారణంగా విధిలేని పరిస్థితుల్లో ఇవాళ పాదయాత్రకు విరామం ఇచ్చినట్లు ఐకాస నేత గద్దె తిరుపతిరావు తెలిపారు. పాదయాత్ర చేస్తున్న మహిళలు, రైతులపై మంత్రులు చేస్తున్న విమర్శలను రైతు ఐకాస కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ తిప్పికొట్టారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా గుడ్లూరులో రైతులు బస చేస్తున్నారు.

అమరావతి రైతుల పాదయాత్రకు నా మద్దతు: నటుడు శివాజీ

ప్రకాశం జిల్లా గుడ్లూరులో రైతుల బస వద్దకు వచ్చిన నటుడు శివాజీ.. అమరావతి రైతులకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. వెంకటేశ్వరస్వామి రథం వద్ద శివాజీ ప్రత్యేక పూజలు చేశారు. రైతుల మహా పాదయాత్ర చరిత్రాత్మకమైనదిగా పేర్కొన్నారు. భావితరాల కోసం రైతులు పోరాటం చేస్తున్నారని అన్నారు. ఇంట్లో తల్లిని గౌరవించని వాళ్లే అమరావతి మహిళా రైతులను కించపరుస్తున్నారని మండిపడ్డారు. మహాత్మగాంధీ చేసిన పోరాటం తరహాలో రాజధాని రైతులు పోరాడుతున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలకు తమకు జరుగుతున్న అన్యాయం గురించి అలోచించే తీరిక లేదన్నారు. కులాల గొడవలో పడి అన్ని మరచిపోతున్నారని వ్యాఖ్యానించారు.

అన్నదాతలకు విద్యార్థుల మద్దతు:

రాజధాని రైతుల పాదయాత్రకు ప్రకాశం జిల్లాలో విద్యార్థులు మద్దతు పలికారు. ప్రకాశం జిల్లా గుడ్లూరులో రైతులు బసచేసిన శిబిరం వద్దకు విద్యార్థులు వచ్చారు. అమరావతి రాజధానిగా ఉండటం ద్వారా తమలాంటి వారి భవిష్యత్తు బాగుంటుందని.. అందుకే పాదయాత్రకు మద్దతు ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. రైతు బిడ్డలుగా పుట్టిన తమకు.. అమరావతి రైతుల కష్టం తెలుసన్నారు. అందుకే భూములు త్యాగం చేసిన రైతులకు మద్దతు ఇస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:

Somu Veerraju: 'అమరావతే రాజధానిగా ఉండాలనేది మా ఆకాంక్ష'

Last Updated : Nov 18, 2021, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details