ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 15, 2020, 4:40 PM IST

Updated : Dec 15, 2020, 10:53 PM IST

ETV Bharat / city

'అమరావతిపై నిర్ణయం మారే వరకు పోరు ఆగదు'

అమరావతి ఉద్యమనాదంతో బెజవాడ గడ్డ హోరెత్తింది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ వేలాదిగా ప్రజలు కదంతొక్కారు. రైతులు, మహిళలు, రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన, కుల సంఘాల నేతలు ఇలా వివిధ వర్గాల ప్రజలు రాజధాని మార్పును సహించేది లేదంటూ గర్జించారు. అమరావతి రాజధానికి మద్దతుగా విజయవాడలో దాదాపు 5కిలోమీటర్ల మేర సాగిన మహాపాదయాత్ర జనసంద్రమై అడుగులు వేసింది. ప్రజల ఆగ్రహాన్ని సీఎం ఇప్పటికైనా గుర్తించకుంటే అన్ని ప్రాంతాలకు ఇదే తరహాలో ఉద్యమాన్ని విస్తరిస్తామని హెచ్చరించారు.

విజయవాడలో అమరావతి ఐకాస మహా పాదయాత్ర
విజయవాడలో అమరావతి ఐకాస మహా పాదయాత్ర

విజయవాడలో అమరావతి ఐకాస మహా పాదయాత్ర

ప్రజా రాజధాని కోసం విజయవాడలో అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ చేపట్టిన ఉద్యమం ఈ నెల 17వ తేదీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అమరావతి జేఏసీ పిలుపు మేరకు విజయవాడలో మహాపాదయాత్ర నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటలకు పడవల రేవు సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర బీఆర్టీఎస్ రహదారిలో దాదాపు 5 కిలోమీటర్ల మేర 3గంటల పాటు సాగింది. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు, రైతులు, ప్రజలు వేలసంఖ్యలో కదం తొక్కారు.

నిర్ణయం మారే వరకు పోరు ఆగదు

భారీ మానవహారంగా ఏర్పడి అమరావతికి మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్‌ నిరంకుశ విధానాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మహిళలు ఆక్షేపించారు. మూడు రాజధానులతో రాష్ట్రం అధోగతి పాలవుతుందని.. సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని నినాదాలు చేశారు. నిర్ణయం మారే వరకు పోరు ఆగదని తేల్చిచెప్పారు.

కదం తొక్కారు

ఒకే రాజధాని కోసం ఒకే గొంతుకగా అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చి తమ గళం వినిపించాయి. ఆకుపచ్చ జెండాలతో సాగిన ఈ పాదయాత్రతో బెజవాడ బీఆర్టీఎస్ రహదారి హరితమయంగా మారింది. ప్రజా రాజధాని అమరావతి కోసం ప్రజాపాదయాత్ర విజయవంతం అయింది. తొలుత వందలు.. ఆపై.. వేల మంది తరలివచ్చారు. ఉప్పెనలా ముందుకు కదిలారు. చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు, రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు.. ఇలా అన్ని వర్గాల వారు పదం పదం కలిపారు. దాదాపు 5 కిలోమీటర్ల పాదయాత్రను సైతం సునాయాసంగా పూర్తి చేశారు. 3గంటల పాటు నడిచినా ఏమాత్రం అలసట లేకుండా కదం తొక్కారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాల్సిందే అని నినాదాలు చేశారు. ఏడాదిగా ముందుండి అమరావతి ఉద్యమాన్ని నడిపించిన మహిళలే.. పాదయాత్ర అగ్రభాగాన ఉండి నడిపించారు.

ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని

పడవల రేవు నుంచి మీసాల రాజేశ్వరరావు వంతెన వరకు మార్గం అంతా అమరావతి నినాదాలు, ఉద్యమ గీతాలతో హోరెత్తింది. అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో పాడిన పాటలు, ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ హుషారెత్తించాయి. ముఖ్యంగా రాజధాని గ్రామాల నుంచి మహిళలు, రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున పాదయాత్రకు తరలివచ్చారు. ‘సీఎం డౌన్‌ డౌన్‌’, ‘భూములిచ్చాం.. రోడ్డున పడ్డాం’, ‘జై అమరావతి.. ‘జయహో అమరావతి, ‘భూములు ఇస్తే కేసులు పెడతారా? ఒకే రాష్ట్రం ఒకే రాజధాని’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా దారిపొడవునా నినాదాలు చేశారు.

సాధించేవరకు ఉద్యమం

రైతుల వేషధారణతో రాజధాని మహిళలు ఓ వాహనంలో ప్రదర్శనలో పాల్గొన్నారు. తలపాగాలతో అరటి గెలలు, కొడవలి, నాగలి, తట్ట, తదితర వ్యవసాయ పనిముట్లను చేతబూనారు. మహిళలు ఆకుపచ్చని చీరలు ధరించారు. రైతు ఐకాస జెండాలు కూడా తోడు కావడంతో కనుచూపు మేర పచ్చదనం పరచుకున్నట్లు కనిపించింది. పాదయాత్ర చివరిలో మీసాల రాజేశ్వరరావు వంతెన కూడలి వద్ద మహిళలు అంతా మానవహారంగా నిలబడ్డారు. చేతులు పైకెత్తి పడికిలి బిగించారు. అమరావతిని సాధించే వరకు ఉద్యమ పథం వీడబోమని ప్రతినబూనారు.

నినాదాలతో హోరెత్తిన అమరావతి

అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రైతు ఐకాస, తెదేపా, భాజపా, సీపీఐ, సీపీఎం, జనసేన, తదితర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. పాదయాత్ర సాగిన ప్రాంతం అంతా అమరావతి నినాదాలతో హోరెత్తింది. అమరావతికి మద్దతుగా రాజధాని గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా హాజరయ్యారు. ఆకుపచ్చ జెండాలతో ఆ మార్గం అంతా పచ్చబడింది. రైతులు, రైతుకూలీలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఐకాస జెండాలు చేతబూని నినాదాలు చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 17వ తేదీన రాజధానిలో జరిగే భారీ సభను ఇంతకు మించి విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు, వైకాపాలోని ప్రజాస్వామ్యవాదులు కూడా హాజరు కానున్నట్లు తెలిపారు.

ఎంతవరకైనా పోరు

అమరావతిని ప్రకటించే వరకు ఎంత వరకైనా పోరాడడానికి తాము సిద్ధమని మహిళలు తెలిపారు. ఏ మాత్రం బెదరక, మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతామని తేల్చిచెప్పారు. అమరావతి పోరు ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నేతలు ప్రశంసించారు.

ఇదీ చదవండి:విజయవాడ నుంచి దిల్లీ బయలుదేరిన సీఎం జగన్

Last Updated : Dec 15, 2020, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details