ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబీవీపీ, భాజపా నిరసనలు

By

Published : Dec 9, 2020, 6:19 PM IST

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. విజయనగరం, విజయవాడలో ఏబీవీపీ నాయకులు ధర్నాకు దిగారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్​ కల్పించాలని భారతీయ జనతా యువమోర్చా నెల్లూరులో.. అసంపూర్తిగా వదిలేసిన పీఎంఏవై ఇళ్లను పూర్తిచేయాలని మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు విశాఖలో నిరసన చేపట్టారు.

bjp protests
నిరసన సెగలు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ జిల్లాల్లో విద్యార్థులు, భాజపా నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. స్కాలర్​షిప్​లు, వసతి గృహాల బకాయిల విడుదలతో పాటు విద్యా సంవత్సరం వృథా కాకూడదని ఏబీవీపీ నాయకులు ధర్నా చేశారు. ప్రజా సమస్యలపై భాజపా నేతలు ఆందోళన చేపట్టారు.

నిరసన తెలుపుతున్న నేతలు

విజయనగరం జిల్లాలో...

విద్యార్థుల వసతి గృహాల ఛార్జీలు, పెండింగ్ స్కాలర్​షిప్​లను.. ఈ ఏడాది ప్రవేశాలు ముగిసేలోగా విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ జిల్లా నాయకులు వంశీ కుమార్ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం శాసనసభ ముట్టడికి వెనకాడేది లేదని స్పష్టం చేశారు. వందలకొద్దీ విద్యార్థులతో కలిసి.. విజయనగరం జిల్లా చీపురుపల్లి తహసీల్దార్​కు వినతిపత్రం సమర్పించారు. ఇంటర్, డిగ్రీ, పీజీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలపై స్పష్టత ఇవ్వకుండా.. విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మద్యం షాపులపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని విమర్శించారు.

వినతిపత్రం సమర్పిస్తున్న ఏబీవీపీ నాయకులు

దాసన్నపేట సమీపంలోని ఎర్ర చెరువును ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారని.. భాజపా విజయనగరం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని ఆరోపించారు. చెరువును ఆక్రమించి, విక్రయాలు జరుపుతున్న స్థిరాస్తి వ్యాపారులకు.. ప్రభుత్వం కొమ్ము కాస్తోందంటూ అక్కడ నిరసన చేపట్టారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి చెరువుకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ కుసుమంచి సుబ్బారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల హరినాథ్​తో సహా పార్టీలోని ఇతర నేతలు పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న నేతలు

విజయవాడలో...

ఫీజు రీఎంబర్స్​మెంట్, స్కాలర్​షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ.. విజయవాడ ధర్నా చౌక్​లో అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు నిరసనకు దిగారు. ఇంటర్ బోర్డు అస్తవ్యస్థ నిర్ణయాలతో లక్షలాది విద్యార్థులు అయోమయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం వృథా కాకుండా.. వివిధ కోర్సులకు తక్షణమే కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కళాశాలలు తెరిచి, హాస్టళ్లు తెరవకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. తక్షణమే వసతి గృహాలు తెరిచి భోజన సదుపాయం కల్పించాలన్నారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులకు రూ. 10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

నిరసన సెగలు

నెల్లూరులో...

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాడుతామని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ తెలిపారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి ఆయన నెల్లూరు రాగా.. చింతారెడ్డిపాలెం జాతీయ రహదారి నుంచి ర్యాలీ నిర్వహించి భాజపా నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు కేంద్రానికి మద్దతిచ్చిన తెదేపా, వైకాపాలు.. రాష్ట్రంలో ద్వంద్వ వైఖరిని పాటిస్తున్నాయని కార్యకర్తల సమావేశంలో దుయ్యబట్టారు. పాదయాత్ర సమయంలోనూ రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించిన సీఎం జగన్.. ఇప్పుడు మాట తప్పి, మడమ తిప్పారని విమర్శించారు.

నిరసన సెగలు

విశాఖ జిల్లాలో...

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిలిచిపోయిన పీఎంఏవై ఇళ్ల నిర్మాణంపై మాజీ శాసనసభ్యులు, భాజపా నేత విష్ణుకుమార్ రాజు నిరసన వ్యక్తం చేశారు. ఏఎస్ఆర్ నగర్​లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించ తలపెట్టిన ఇళ్ల నిర్మాణం అర్థాంతరంగా నిలిచిపోయిందన్నారు. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం 482 ఇళ్లకు గాను కేవలం 280 మాత్రమే కట్టించి, మిగిలిన 202 కడతారో కట్టరో తేల్చకుండా వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి మిగతా ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. సమస్య గురించి మాట్లాడటానికి ప్రయత్నించినా.. సీఎం సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు.

నిరసన తెలుపుతున్న నేతలు

ఇదీ చదవండి:

భూవివాదం: తహసీల్దార్ ఎదుట మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details