ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పునఃప్రారంభంతో కళకళలాడుతున్న నగరవనం - Tirumala Urban Park news

ఎర్రచందనం వృక్షాల నీడలో పక్షుల కిలకిలరావాలు వింటూ... ప్రకృతి ఒడిలోని నీటికొలను చూస్తూ... వాకింగ్‌ చేస్తే కలిగే ఉల్లాసం మాటల్లో చెప్పలేం. కొవిడ్‌ కారణంగా దాదాపు 8 నెలలు ఈ అనుభూతికి దూరమైన తిరుపతి నగరవాసులు.... ఇప్పుడు మళ్లీ ప్రకృతి ఒడిలో సేదతీరుతూ సాయంసంధ్య వేళలను సంతోషంగా గడుపుతున్నారు. శేషాచలం అటవీప్రాంతంలోని నగరవనం పునఃప్రారంభమై నగరవాసులు, శ్రీవారి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.

Urban Park Rush With People in Tirumala
పునఃప్రారంభంతో కళకళలాడుతున్న నగరవనం

By

Published : Dec 20, 2020, 4:46 AM IST

పునఃప్రారంభంతో కళకళలాడుతున్న నగరవనం

కపిలతీర్థం-అలిపిరి రహదారిలో శేషాచలం అటవీ ప్రాంతంలో భాగంగా నిర్మించిన నగరవనం... తిరుపతిలో ప్రఖ్యాతిగాంచిన విహారస్థలం. నగరానికే తలమానికంగా నిలిచి.. ప్రకృతి అందాలతో అలరారే ఈ ప్రాంతంలో గడిపేందుకు స్థానికులు పోటెత్తుతారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు విరామ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి వెళ్తుంటారు. ఎర్రచందనం వృక్షాల మధ్య... ఉండే ప్రత్యేకమైన వాతావరణమే ఇందుకు కారణం. లాక్‌డౌన్‌ నిషేధాజ్ఞలతో దాదాపు 8 నెలలు నగరవనం మూతపడింది. సందర్శకుల లేక వెలవెలబోయిన ఈ ప్రాంతం... ఇప్పుడు మళ్లీ కళకళలాడుతోంది.

కొవిడ్‌ భయంతో ఇళ్లకే పరిమితమైన తిరుపతివాసులు... నగరవనం ప్రారంభమైందని తెలుసుకుని ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కుటుంబసభ్యులతో కలసి వారాంతాల్లో ఇక్కడే గడపుతున్నారు. ఆటపరికరాలూ ఇక్కడ ఉండటంతో... చిన్నారులూ నగరవనానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెద్దసంఖ్యలో సందర్శకులు వస్తుండటంతో... అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. సందర్శకులకు మాస్క్‌ తప్పనిసరి చేయటమేగాక... పరిమిత సమయాల్లోనే అనుమతిస్తున్నారు. నడక కోసం వచ్చే స్థానికులను ఉదయం 7 నుంచి 9 వరకూ... సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకే లోపలికి పంపుతున్నారు.

సందర్శకులను మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అనుమతిస్తున్నారు. శీతకాలంలో త్వరగా చీకటి పడుతుండటంతో.. అటవీ జంతువుల నుంచి ముప్పువాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ లభించే సహజమైన ప్రాణవాయువుతో ఆరోగ్యం-ప్రశాంతత లభిస్తున్నాయని... ప్రకృతి ఒడిలో గడపటం సహజంగానే ఉత్తేజాన్ని ఇస్తుందని సందర్శకులు, స్థానికులు చెబుతున్నారు. నగరవనం తెరుచుకోవటంతో నడక ఇబ్బందులు తీరాయని వాకర్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హడావుడి జీవితంలో కాసేపు పచ్చని చెట్లమధ్య సేదతీరే వీలు కల్గుతోందుంటున్నారు.

ఇదీ చదవండీ... ఏఓబీలో ఈ నెల 21న బంద్​.. పిలుపునిచ్చిన మావోయిస్టులు

ABOUT THE AUTHOR

...view details