ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 1, 2020, 8:00 AM IST

ETV Bharat / city

భక్తుల రద్దీతో దర్శన టికెట్లు పెంచే యోచనలో తితిదే

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా ప్రభావంతో కొన్ని నెలల పాటు నిర్మానుష్యంగా ఉన్న తిరుమలలో అన్​లాక్‌ ప్రారంభమయ్యాక భక్తుల రాక మొదలైంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించారు. క్రమంగా భక్తుల సంఖ్య పెంచిన తితిదే అన్‌లాక్‌ 5.0 ప్రారంభం కావడంతో దర్శనాల టికెట్ల కేటాయింపు మరింత పెంచింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా పందొమ్మిది వేల టికెట్లను జారీచేస్తున్న తితిదే.. మూడు వేల మందికి సర్వదర్శనం అవకాశం కల్పిస్తోంది.

తితిదే
తితిదే

తిరుమల శ్రీవారిని దర్శించుకొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అన్‌లాక్‌ 5.O నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకొనేందుకు వస్తున్న భక్తులకు అవకాశం కల్పిస్తూ తితిదే చర్యలు చేపడుతోంది. ప్రత్యేక ప్రవేశం, సర్వదర్శనం, సుపథం, శ్రీవాణి ట్రస్ట్‌ ఇలా వివిధ మార్గాల్లో శ్రీవారి దర్శనానికి వీలు కల్పిస్తోంది. దీంతో శ్రీవారిని దర్శించుకొనే వారి సంఖ్య దాదాపుగా పాతికవేలకు చేరింది. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత రోజుకు ఆరు వేల మందితో దర్శనాలు ప్రారంభించిన తితిదే క్రమంగా సంఖ్య పెంచుతూ పాతికవేలకు చేరింది. కరోనా ప్రభావంతో మార్చి నుంచి జూన్‌ వరకు దాదాపు మూడు నెలల పాటు నిర్మానుష్యంగా ఉన్న తిరుమల...ఇప్పుడు భక్త జన సంచారంతో సాధారణ పరిస్థితికి చేరుకుంటోంది.

అధిక మాసం రావడం వల్ల ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించిన తితిదే ఉత్సవాలు ముగిసినా.. నవంబర్‌ నెల నుంచి దర్శనాల కోటాను భారీగా పెంచింది. నవంబర్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటాను విడుదల చేసిన దేవస్థానం... రోజుకు 19 వేల టికెట్లను అందుబాటులో ఉంచింది. నవంబర్‌ నెలలో ఐదులక్షలా డెబ్బైవేల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచగా....మూడు రోజుల్లోనే నాలుగు లక్షలా తొంభై మూడు వేల టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. మరో వైపు ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు, తితిదే బోర్డు సభ్యుల కోటా, ఛైర్మన్‌ కార్యాలయం టిక్కెట్లను జారీ చేస్తోంది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌ వద్ద రోజుకు మూడువేల సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లు జారీ చేస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ల కోసం వచ్చే భక్తులు కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల తరహాలోనే సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో జారీచేయాలని భక్తులు కోరుతున్నారు.

సర్వదర్శనం టోకెన్ల కోసం తరలివస్తున్న భక్తులు...నిరసనలు, తోపులాటలకు దిగుతుండటంతో తితిదే పునరాలోచనలో పడింది. భూదేవి కాంప్లెక్స్‌ వద్ద జారీ చేసే టికెట్ల కేటాయింపు విధానాన్ని సమీక్షించాలని నిర్ణయం తీసుకొంది.

కొవిడ్‌ నిబంధనల పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించేందుకు అవకాశం ఉండటం.. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీచేసే ప్రాంతంలో పరిస్థితులు చేయిదాటుతుంది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచే అంశంపై తితిదే ఆచితూచి వ్యవహరిస్తోంది.

ఇదీ చదవండి :కరణం బలరాం, ఆమంచి వర్గీయుల మధ్య ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details