'సర్వదర్శనానికి రోజుకి 3750 ఆఫ్లైన్ టోకెన్లు ఇస్తున్నాం' - tirumala latest news
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. సర్వదర్శనానికి సంబంధించి రోజుకి 3750 ఆఫ్లైన్ టోకెన్లు ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ భక్తుల వివరాలను తీసుకుంటున్నట్లు తెలిపారు.
కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వ మార్గ దర్శకాలను పాటిస్తూ... వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల వివరాలు తీసుకుంటున్నట్లు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. భక్తుల శాంపిల్స్ను తీసుకునేందుకు ప్రత్యేక సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. స్వామి దర్శనానికి వస్తున్న భక్తులతో తితిదే ఉద్యోగులు సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున రోజుకి 20 నుంచి 30 మందికి చొప్పున ఉద్యోగుల నమూనాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న ఆలయానికి ఇతర ప్రాంతాల వారిని అనుమతించటంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చినట్లు చెప్పారు. సర్వదర్శనానికి సంబంధించి రోజుకి 3750 ఆఫ్లైన్ టోకెన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈనెల 15 వరకూ రోజుకి 3750 టోకెన్ల చొప్పున జారీ చేశామన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వారానికి సరిపడ టోకెన్లను ఒకేరోజు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తిరుమలలో భక్తులకు కావల్సిన అన్ని వసతులు కళ్యాణ కట్ట, అన్నదానం కాంప్లెక్స్, రిసెప్షన్లో రూమ్లు ఇవ్వడం, లడ్డూ, ప్రసాదం వితరణ చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయడం వల్ల గత మూడు రోజుల్లో ఎటువంటి సమస్య రాలేదని చెప్పారు.