ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 23, 2020, 4:24 PM IST

Updated : May 23, 2020, 7:30 PM IST

ETV Bharat / city

తమిళనాడులోని స్వామివారి స్థిరాస్తుల విక్రయానికి తితిదే నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం... తమ స్థిర ఆస్తులు కొన్నింటిని విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెలలో తితిదే ధర్మకర్తల మండలి తీర్మానం మేరకు ఆస్తులను విక్రయించడం.. కోట్ల రూపాయలను తితిదే ఖజానాకు జమ చేయడానికి వీలుగా చర్యలు చేపట్టింది. తొలి విడతలో తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 26 స్థిరాస్తులను విక్రయించడానికి ఉత్తర్వులు జారీచేసింది. తితిదే ఎస్టేట్‌ అధికారి దేవేంద్రరెడ్డి పేరుతో.... ఆస్తుల విక్రయానికి సంబంధించి ఏప్రిల్‌ 30న విడుదల చేసిన ఉత్తర్వులు ఆసల్యంగా వెలుగు చూశాయి.

tirumala tirupathi devasthanam  tamilandu assets for auction
tirumala tirupathi devasthanam tamilandu assets for auction

కలియుగ వైకుంఠనాథుడు...తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు విరాళంగా ఇచ్చిన స్థిరాస్తులను విక్రయించాలని తితిదే నిర్ణయించింది. ప్రపంచ నలుమూలల ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు....మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను తితిదే పేరిట అందజేశారు. ఇలా దేశం నలుమూలల వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు శ్రీవారి పేరిట ఉన్నాయి. ఫిబ్రవరి 29 తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో స్వామివారి ఆస్తులు విక్రయించాలని తీర్మానం చేశారు.

ఈ తీర్మానానికి అనుగుణంగా తితిదే ఆస్తులను విక్రయించడానికి నాలుగు కేటగిరీలుగా విభజించారు. వీటిలో కోర్టు వివాదాలతో విక్రయించడానికి వీలుకానివి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి, దేశవ్యాప్తంగా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉన్నవి, తితిదే ఏర్పాటు చేసే బృందాల ద్వారా విక్రయించాల్సినవిగా విభజించారు. ఇందులో భాగంగా తొలి విడతలో తితిదే ఏర్పాటు చేసిన బృందాలు విక్రయించే ఆస్తుల్లో తమిళనాడు రాష్ట్రంలోని 26 ఆస్తులను గుర్తించారు. తొలి విడతలో విక్రయించడానికి గుర్తించిన ఆస్తుల్లో కనిష్టంగా 72 వేల రూపాయల నుంచి గరిష్టంగా 43.74 లక్షల రూపాయల విలువ చేసే ఆస్థులు ఉన్నాయి. వీటన్నింటికి తితిదే 1.52 కోట్ల రూపాయల మేర ధర నిర్ణయించింది.

నిర్వహణలో లేని నిరర్థక ఆస్తులను విక్రయించాలని నిర్ణయం తీసుకొన్న తితిదే... జనవరి, ఫిబ్రవరి నెలలో తితిదే సర్వేయర్ల ద్వారా తమిళనాడులోని స్థిరాస్తులపై సర్వే చేయించి తొలి విడత విక్రయానికి 26 ఆస్తులను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన ఆస్తుల విక్రయం కోసం ఎనిమిది మంది అధికారులతో కూడిన రెండు బృందాలు ఏర్పాటు చేసింది. తొలి బృందానికి తితిదే సహాయ కార్యనిర్వహణాధికారి ఉదయభాస్కరరెడ్డి, రెండో బృందానికి తితిదే ఆస్థుల విభాగ తహశీల్దార్‌ గౌరిశంకరరావు నేతృత్వం వహించనున్నారు. వీరి పరిధిలో తొలి బృందంలో మునీంద్ర, మోహన్‌రావు, బాలాజీ...రెండో బృందంలో సుబ్బరాయుడు, హరినాథ్‌, గురవయ్య సహాయకులుగా సేవలు అందించనున్నారు. ఆస్తుల విక్రయ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన అధికారుల బృందం...బహిరంగ వేలం విధి, విధానాలు ఖరారు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

ఇదిలావుంటే తిరుమల శ్రీవారికి భక్తులు ఇచ్చిన ఆస్తులను బహిరంగ వేలం వేయడంపై హిందూ ధార్మిక సంస్థలు, ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అన్యాక్రాంతమవుతున్న భూములను రక్షించాల్సిన తితిదే....విక్రయించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో శ్రీవారి ఆస్తులను విక్రయిస్తే...విరాళాలు ఇచ్చే భక్తులు ముందుకురారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీవారి ఆస్తులను విక్రయించడానికి నియమించిన అధికారుల బృందాలు...బహిరంగ వేలంపై విధి, విధానాలు ఖరారు చేయడంతో పాటు నిధులను శ్రీవారి ఖజానాకు జమచేసే వరకు బాధ్యత వహించాలని తితిదే ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి: నాగబాబు అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు: పవన్

Last Updated : May 23, 2020, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details