ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడే సూర్య గ్రహణం... మూతపడిన ఆలయాలు

ఆదివారం సూర్యగ్రహణం కారణంగా... రాష్ట్రంలోని దేవాలయాలు శనివారమే మూతపడ్డాయి. సంప్రదాయ శుద్ధి కార్యక్రమాల అనంతరం దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. శ్రీకాళహస్తి ఆలయం మాత్రం.. యథావిథిగా తెరిచేఉంటుంది.

By

Published : Jun 20, 2020, 4:48 PM IST

Updated : Jun 21, 2020, 12:15 AM IST

temples in the state close due to solar eclipse
temples in the state close due to solar eclipse

నేడు ఉదయం 10 గంటల 18 నిమిషాలకు సూర్య గ్రహణం మొదలుకానుంది. మధ్యాహ్నం 1.38 గంటలకు ముగియనుంది. గ్రహణం కారణంగా శ్రీకాళహస్తి మినహా రాష్ట్రంలోని ఆలయాలు మూతపడ్డాయి. శనివారం సాయంత్రం నుంచే ఆలయాల్లో దర్శనాలు నిలిచిపోయాయి.

తిరుమలలో..

శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ ముగియగానే.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి తెరుస్తారు. నిత్య కైంకర్యాల తర్వాత ఇవాళ రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. గ్రహణం కారణంగా.. ఈ ఆదివారం నాడు ఆర్జిత సేవలు, దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.

ఇంద్రకీలాద్రిపై..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని.. గ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటలకే మూసివేశారు. పంచహారతులు, నివేదన అనంతరం.. కవాట బంధనం చేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు.. ఆలయాన్ని శుద్ది చేస్తారు. అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, హారతులు ఇస్తారు. గ్రహణం రోజున అన్ని రకాల ఆర్జిత సేవలను, దర్శనాలను నిలిపివేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

శ్రీశైలంలో..

శ్రీశైలం భ్రమరాంబామల్లికార్జున స్వామి దేవస్థానాన్ని గ్రహణం సందర్భంగా.. శనివారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. ఆదివారం గ్రహణం వీడిన తర్వాత.. మంగళ హారతులు, కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. సోమవారం నుంచి యథావిథిగా దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ క్షేత్రం ద్వారకా తిరుమల ఆలయమూ శనివారం మూతపడింది. ఆదివారం నిత్య కల్యాణం, ఆర్జిత సేవలు, వాహన సేవలు రద్దు చేశారు. గ్రహణం అనంతరం ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు.

శ్రీకాళహస్తిలో..

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం శనివారం సాయంత్రం 5 గంటలకు మూసివేశారు. శుద్ధి అనంతరం ఆదివారం సాయంత్రం 5 గంటలకు దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. శ్రీకూర్మంలోని కూర్మనాథస్వామి ఆలయాన్ని ఆదివారం ఉదయం 6 గంటలకు మూసివేస్తారు. సాయంత్రం 6 గంటలకు దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం సాయంత్రం 6 గంటలకే మూసి వేయగా... ఆదివారం సాయంత్రం 4 గంటల తర్వాత దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు.

మరికొన్ని...

విశాఖ జిల్లాలోని ప్రముఖ క్షేత్రం సింహాచలం.. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం.. కర్నూలు జిల్లా అహోబిలంతో పాటు.. మరిన్ని ఆలయాల్లో సంప్రదాయం ప్రకారం దర్శనాలు నిలిపివేశారు. గ్రహణం విడిచిన తర్వాత సంప్రదాయ సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం.. యథావిథిగా నిత్య పూజలు కొనసాగించనున్నారు.

శ్రీకాళహస్తిలో యథాతథం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఎప్పటిమాదిరే.. గ్రహణం రోజున ఆలయాన్ని తెరిచే ఉంచనున్నారు. రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలకు ఖ్యాతి గాంచిన ఈ కోవెలలో కొలువైన స్వామివారు.. 27 నక్షత్రాలు, నవగ్రహాలను కవచంగా ధరించి ఉంటారు. ఈ కారణంగా ఎలాంటి గ్రహణాలు ఈ ఆలయానికి వర్తించవని పండితులు చెబుతున్నారు. పైగా గ్రహణం రోజున స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహిస్తారు. దర్శనాలకు భక్త జనం భారీగా తరలివస్తారు.

ఇదీ చదవండి:

ఆదివారం సూర్యగ్రహణం.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Last Updated : Jun 21, 2020, 12:15 AM IST

ABOUT THE AUTHOR

...view details