రథసప్తమి వేడుకలు తితిదే ఆధ్వర్యంలో తిరుమలలో కన్నుల పండువగా జరిగాయి. సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమై.. చంద్రప్రభ వాహనంతో ఈ వేడుకలు ముగిశాయి. ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ పడమర, ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ మలయప్ప స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన తరువాత అర్చకులు ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు. ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు స్వామి వారు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.
మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు స్వామివారికి చక్రస్నానం చేయించారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై విహరించారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.