ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 29, 2021, 4:04 PM IST

ETV Bharat / city

శ్రీవారి దర్శనంపై కరోనా ప్రభావం..తిరుమలకు రాలేకపోతున్న భక్తులు

కరోనా విజృంభణ నేపథ్యంలో.. శ్రీవారి దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రాలేకపోతున్నారు. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నెల రోజులకు ముందే తితిదే విడుదల చేసినా.. అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించడం వల్ల వాటిని కొనుగోలు చేసిన భక్తులు తిరుమలకు రాలేని పరిస్థితి నెలకొంది. దర్శన టిక్కెట్లు పొందిన వారు.. 40 శాతానికి పైగా గైర్హాజరవుతున్నట్లు తితిదే తెలిపింది.

corona effect on tirumala srivari darshan
corona effect on tirumala srivari darshan

శ్రీవారి దర్శనంపై కరోనా ప్రభావం

తిరుమలేశుణ్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం నెల రోజులకు ముందే దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. ఏప్రిల్‌కు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను.. మార్చి 20న విడుదల చేశారు. ఆ సమయంలో రోజుకు 50 నుంచి 60 వేల మంది స్వామివారిని దర్శించుకునే పరిస్థితులు ఉండడంతో.. రోజుకు 25 నుంచి 30 వేల టిక్కెట్లను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం కరోనా ఉగ్రరూపం దాల్చడంతో అనేక రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తూ లాక్‌డౌన్‌ బాట పట్టాయి. టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు దర్శనానికి రాలేకపోతున్నారు. రోజువారీగా 40 నుంచి 50 శాతం మంది భక్తులు గైర్హాజరవుతున్నట్లు తితిదే గుర్తించింది.

టిక్కెట్లు పొంది కూడా దర్శనానికి రాలేని పరిస్థితులు నెలకొన్నట్లు.. తితిదే కాల్‌సెంటర్‌, ఎస్వీబీసీని ఎక్కువ సంఖ్యలో భక్తులు సంప్రదిస్తున్నారు. భక్తుల అభ్యర్థనలను పరిశీలించిన తితిదే ఈ నెల 21 నుంచి 30 వరకు టిక్కెట్లు పొందిన వారు 90 రోజుల్లో ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించింది.

కొవిడ్ ప్రభావంతో శ్రీవారి దర్శనాల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో.. తక్కువ సంఖ్యలోనే మే నెల కోటా టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. రోజుకు 15వేల టిక్కెట్ల చొప్పున.. ఈ నెల 20న టిక్కెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. టికెట్లు విడుదల చేసి రోజులు గడుస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో టిక్కెట్లు పొందేందుకు భక్తులు ఆసక్తి చూపడం లేదు.

ఇదీ చదవండి:'కొవిడ్ వచ్చిన వారు జాగ్రత్తలు తీసుకోకపోతే గుండె పోటు'

ABOUT THE AUTHOR

...view details