మంచు, ఎండ, వర్షం.. దేశ రక్షణ కోసం ఎలాంటి సమస్యనూ మన సైనికులు పట్టించుకోరని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. తిరుపతిలో నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. దేశం కోసం సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులకు వందనం తెలిపారు. ప్రాణాలు లెక్క చేయకుండా దేశాన్ని కాపాడుతున్నారని వ్యాఖ్యానించారు. మృత్యు భయం వీడి మాతృభూమి సేవలో తరిస్తున్నారని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ అవతరించి ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తవుతుందని సీఎం జగన్ వివరించారు. నియంత పాలనకు వ్యతిరేక పోరులోనే బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిందన్న ముఖ్యమంత్రి... ముజిబుర్ గెలుపును ఆనాటి పాక్ పాలకులు జీర్ణించుకోలేదని వ్యాఖ్యానించారు. ముజిబుర్కు ప్రధాని పదవి ఇచ్చేది లేదని మొండికేశారని చెప్పారు. 1971 భారత్-పాక్ యుద్ధం.. ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమని అభిప్రాయపడ్డారు.
బంగ్లాదేశ్ అనే దేశం ఉందంటే మన సైనికుల పోరే కారణని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. మన సైనికుల పోరాటం కొత్త దేశానికి కారణమైందన్న జగన్... మన సైనికుల దెబ్బకు యుద్ధం 13 రోజుల్లోనే ముగిసిందని వివరించారు. బంగ్లా విమోచనకు పోరాడిన వారి కోసం సైన్యమే కదిలి వచ్చిందని... మహావీరచక్ర వేణుగోపాల్కు వందనం అంటూ సైన్యం వచ్చిందని చెప్పారు.