తిరుపతిలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కొవిడ్ కేసుల నమోదు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సమీక్ష జరిపారు. అనంతరం ఆళ్ల నాని విలేకర్లతో మాట్లాడుతూ బాధిత వ్యక్తి ద్వారా ఇతరులకు ఇది సోకలేదన్నారు. ప్రభుత్వ ప్రకటన తర్వాత తిరుపతిలో కలకలం రేగింది. బాధితుడు ఉన్న వీధి, పరిసర ప్రాంతాలు నిర్మానుష్యమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 3న తిరుపతిలోని ఓ 50 ఏళ్ల వ్యక్తి వైరస్ నిర్ధారణ పరీక్ష కోసం నమూనా ఇచ్చారు. 4వ తేదీన పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తర్వాతి రోజు ఆయన స్విమ్స్ కొవిడ్ కేర్ ఆసుపత్రిలో చేరారు. ఏప్రిల్ 13న డిశ్ఛార్జి అయ్యారు. కుటుంబసభ్యుల్లోనూ పలువురికి వైరస్ సోకింది. అందరూ కోలుకున్నారు. డెల్టా ఫ్లస్ వేరియంట్ గుర్తించినట్లు సమాచారం అందగానే ఆరోగ్యసిబ్బంది బాధితుడి నివాసం, పరిసరాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. స్థానికుల నుంచి అనుమానిత లక్షణాల వివరాలు సేకరించారు.
ఎలా తెలిసిందంటే...
రాష్ట్రంలోని ప్రతి ఆర్టీపీసీఆర్ ల్యాబ్ నుంచి 15 రోజులకోసారి 15 నమూనాలను సీసీఎంబీకి పంపుతున్నారు. వీటిని పరీక్షించి వైరస్ వేరియంట్ గుర్తిస్తున్నారు. ఈ నమూనాలను అక్కడే ఉంచి... కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు వాటిని మళ్లీ పరీక్షిస్తున్నారు. ఈ నమూనాను తొలుత పరీక్షించినప్పుడు అనుమానం రాలేదు. తాజాగా కలకలం రేపుతున్న డెల్టా ఫ్లస్ గురించి తెలుసుకొనేందుకు మళ్లీ పాత నమూనాలను పరీక్షిస్తుండగా.. ఈ నమూనాలో ఆ వేరియంట్ బయటపడిందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని ‘ఈనాడు’కు తెలిపారు. నమూనా సేకరించిన రెండున్నర నెలల దాటిన తర్వాత తెలిసిన ఈ కేసుకు సంబంధించిన ఎవరికీ అనారోగ్య లక్షణాలు లేవని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. బాధిత వ్యక్తి చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నవారిలో 15 మంది నుంచి నమూనాలు సేకరించి, ల్యాబ్కు పంపిస్తున్నట్లు వెల్లడించారు. సమీపంలో ఎవరికీ ఎలాంటి సమస్యలు లేనందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ డెల్టా ప్లస్ కేసుపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. మూడో వేవ్ అనివార్యమైతే సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.