తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేర చరిత్ర కలిగిన వారి నియామకాన్ని కచ్చితంగా రద్దు చేస్తామని తితిదే, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. ‘దేవుడి సేవలో నేర చరితులకు స్థానం కల్పించడం ఏంటి? తితిదే బోర్డులో నేర చరిత్రగల వారు ఉండటానికి వీల్లేదు. వాళ్లు అనర్హులు. పవిత్రమైన తిరుమల బోర్డులో ఎవరిని పడితే వారిని నియమించి భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దనీ. బోర్డులో కొంత మందికి నేర చరిత్ర ఉన్న విషయం మాకు తెలుసు.. వారి నియామకాన్ని రద్దు చేస్తాం’ అని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు స్పష్టం చేసింది. విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది.
తితిదే ప్రత్యేక ఆహ్వానితులు, తితిదే బోర్డులో నేర చరిత్రగల వారి నియామకాన్ని సవాలు చేస్తూ తెదేపా నేత ఎం.ఉమామహేశ్వర నాయుడు, హిందూ జనశక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కాకుమాను లలిత్ కుమార్, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, తితిదే బోర్డు మాజీ సభ్యుడు జి.భానుప్రకాశ్రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. ఏపీ దేవాదాయ చట్టానికి సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను భానుప్రకాశ్రెడ్డి సవాలు చేశారు. గురువారం ఈ వ్యాజ్యాలు హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చాయి. ప్రభుత్వ న్యాయవాది శివాజీ.. తితిదే తరఫు సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనలను వినిపిస్తూ.. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ సభలో చట్టరూపం దాల్చిందని తెలిపారు. దానికి గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. గవర్నర్ నిర్ణయం తర్వాత వ్యాజ్యాలపై విచారణ జరుపుతామని తెలిపింది. భాజపా నేత తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలను వినిపిస్తూ.. బోర్టు సభ్యుల్లో కొందరు నేర చరిత్రగల వారు ఉన్నారని, వారికి అనర్హత వర్తిస్తుందని చెప్పారు. తితిదే తరఫు సీనియర్ న్యాయవాది బదులిస్తూ.. ఏ ఒక్కరికీ అనర్హత వర్తించదని పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘క్రిమినల్ కేసులు ఉన్నవారు తితిదే బోర్డులో సభ్యులుగా లేరా? అలాంటివారి నియామకాన్ని కచ్చితంగా రద్దు చేస్తాం. మంచి వ్యక్తిత్వం, ప్రజల్లో విశ్వసనీయత ఉన్నవారిని సభ్యులుగా నియమించాలి. నచ్చిన వారిని నియమించుకోవడానికి వీల్లేదు’ అని పేర్కొంది.