భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్వయంగా రూపొందించి, అభివృద్ధి చేసిన ఉపగ్రహ వాహకనౌక పీఎస్ఎల్వీ. 1993లో తొలి ప్రయోగం జరిగిన దీనిద్వారా ఇప్పటికి 374 ఉపగ్రహాలు (46 స్వదేశీ, 328 విదేశీ) విజయవంతంగా కక్ష్యలోకి చేరాయి. ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్-1, మార్స్ ఆర్బిటర్ మిషన్, స్పేస్ క్యాప్సూల్ రికవరీ ప్రయోగం, ఇండియన్ రీజినల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ తదితరాలన్నీ ఈ వాహకనౌక ద్వారానే ప్రయోగించారు. 1970-80లో శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎల్వీ) ద్వారా అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించిన ఇస్రో.. తర్వాత ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఏఎస్ఎల్వీ)ని నిర్మించి వినియోగించింది. ఈ రెండూ ప్రపంచ యవనికపై భారత ఉనికిని చాటినా.. ఆశించిన ఫలితాలు రాలేదు. దాంతో 1990-2000 మధ్యకాలంలో పీఎస్ఎల్వీ రాకెట్ను మూడోతరం కింద నిర్మించారు.
వైఫల్యం నుంచి విజయం వైపు..
1993 సెప్టెంబరు 20న పీఎస్ఎల్వీ-జి వాహకనౌక ద్వారా పీఎస్ఎల్వీ-డి1 ప్రయోగాన్ని చేపట్టగా, అది విఫలమైంది. తర్వాత 1994, 1996లో పీఎస్ఎల్వీ-డి2, డి3 ప్రయోగాలు చేయగా.. ఆ రెండూ విజయవంతమయ్యాయి. ఆ తర్వాత నుంచీ ‘సి’ సిరీస్ ప్రయోగాలు మొదలయ్యాయి. 1997 సెప్టెంబరు 29న పీఎస్ఎల్వీ-సి1 ప్రయోగం జరగ్గా.. ఐఆర్ఎస్-1డి ఉపగ్రహాన్ని సూర్యానువర్తన కక్ష్యలోకి పంపించారు. ఇక వరుసగా ప్రయోగాలు జరిగాయి. పీఎస్ఎల్వీ-సి13 ప్రయోగం ఒక్కటే జరగలేదు.
క్రమంగా మెరుగుపడుతూ..
అవసరాలకు అనుగుణంగా ఈ వాహకనౌక సామర్థ్యం మెరుగుపడుతూ వచ్చింది. 1993లో పీఎస్ఎల్వీ-జిగా గుర్తింపు పొందగా.. ఆ తర్వాత 2007 ఏప్రిల్ 23 నాటి ప్రయోగానికి పీఎస్ఎల్వీ-సీఏగా మారింది. 2008 అక్టోబరు 22 నాటికి చంద్రయాన్-1 ప్రయోగానికి ఎక్సెల్గా రూపాంతరం చెందింది. 2019 జనవరి 24 ప్రయోగానికి పీఎస్ఎల్వీ-డిఎల్, 2019 ఏప్రిల్ 1 ప్రయోగానికి పీఎస్ఎల్వీ-క్యూఎల్గా మారింది. ఇక్కడ వాహకనౌక సాంకేతికంగా అయిదు రకాలుగా మారగా.. దాదాపు ప్రతిసారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పీఎస్ఎల్వీ మొత్తం వాహకనౌకల్లో పీఎస్ఎల్వీ-డి1, పీఎస్ఎల్వీ-సి39 ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి.
ఉపగ్రహాలను మోసుకెళ్లడం
- 1999 నుంచి ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 328 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి.