ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ప్రభావం.. దుర్భరంగా స్వర్ణకారుల జీవనం - నెల్లూరు జిల్లా వార్తలు

స్వర్ణకారులు... బంగారు, వెండి నగలకు మెరుగులు దిద్దే శ్రామికులు... అతివలు ధరించే అందాల ఆభరణాల వెనక కనపించని అజ్ఞాత వాసులు. ఇంతా చేసినా... బంగారానికి ఉన్న మెరుగు తమ బతుకులలో మాత్రం లేదని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్​డౌన్ విధించడంతో పెళ్లిళ్లు, ఫంక్షన్​లు, వేడుకలు అన్నీ రద్దయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో... చేయడానికి పని లేక, కుటుంబాన్ని పోషించుకోలేక, అద్దెలు కట్టలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

goldsmith-problems
నెల్లూరు జిల్లాలో స్వర్ణకారుల కష్టాలు

By

Published : Jul 4, 2020, 11:47 AM IST

రాష్ట్రంలోనే అత్యధికంగా స్వర్ణాభరణాలు తయారుచేసే జిల్లాల్లో నెల్లూరు ఒకటి. నెల్లూరు నగరంతోపాటు, కావలి, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ, రాపూరు వరకు పెద్ద ఎత్తున స్వర్ణాభరణాలు విభిన్నంగా తయారు చేస్తారు. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం జరిగే ఈ జిల్లాలో 25 వేల మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు ఉన్నారు. లక్షల మంది జనాభా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.

అర్థాకలితో జీవిస్తున్నాం...

కరోనా కారణంగా లాక్​డౌన్ విధించిన నేపథ్యంలో... నాలుగు నెలలుగా స్వర్ణకారులకు పనుల్లేక విలవిల్లాడుతున్నారు. బంగారం కొనుగోలు లేకపోవడంతో పెద్ద వ్యాపారులు కూడా తమకు పనులు ఇవ్వడం లేదని... కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వృత్తిపై ఆధారపడి... స్వర్ణకారులతో పాటు మెరుగు పనిచేసేవారు, చెక్కే పని, రాళ్లు, డైమండ్స్ బిగించేవారు, పాలిష్ చేసేవారు... ఇలా ఎంతో మంది పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దెలతో పాటు... దుకాణం అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్వర్ణకారులు వాపోతున్నారు.

4నెలలుగా కరెంట్ బిల్లులు కట్టలేదు...

కొందరు బంగారు వ్యాపారులు తమకు నిత్యావసర వస్తువులు ఇచ్చినా... అవి పదిహేను రోజులు మాత్రమే సరిపోయాయని అంటున్నారు. పనులు ఉంటేనే కుటుంబ పోషణ జరుగుతోందని... ప్రభుత్వం ఇచ్చే కిలో బియ్యం, దాతలు ఇచ్చే నిత్యావసర వస్తువులు ఎన్ని రోజులు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. నాలుగు నెలలుగా కరెంట్ బిల్లులు చెల్లించలేదని... కొందరి ఇళ్లు, దుకాణాలకు విద్యుత్ కనెక్షన్​లు కూడా కట్ చేశారని వాపోతున్నారు.

ప్రభుత్వం తమను ఆదుకోవాలని స్వర్ణకారులు కోరుతున్నారు. ప్రతి కుటుంబానికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు.
లాక్​డౌన్ నిబంధనలను సవరించి... బంగారు వ్యాపారాలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి:

చూశారా మీరు?!: చెట్టులో ఇల్లు.. ఎంత వింతగా ఉందో!

ABOUT THE AUTHOR

...view details