ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 15, 2019, 2:58 AM IST

Updated : Oct 15, 2019, 5:06 PM IST

ETV Bharat / city

నేడే రైతు భరోసా.. నెల్లూరులో సీఎం జగన్ శ్రీకారం

రైతులకు పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా రూపొందించిన రైతు భరోసా పథకం  ఇవాళ  ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా కాకుటూరులో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా రూ.13 వేల 500 రూపాయలను ప్రభుత్వం అందివ్వనుంది. అర్హులైన 54 లక్షల పైగా రైతులందరికీ నేటి నుంచి ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. దరఖాస్తు గడువును నవంబర్ 10 వరకు పొడిగించారు.

నేడే రైతు భరోసా.. నెల్లూరులో సీఎం జగన్ శ్రీకారం


రైతులకు పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన రైతుభరోసా పథకం నేడు ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామం పరిధిలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్ర నిధులను వినియోగిస్తున్నందున ఈ పథకానికి ‘‘ వైఎస్సార్ రైతుభరోసా- పీఎం కిసాన్​’ గా పేరు పెట్టారు.

నేడే రైతు భరోసా.. నెల్లూరులో సీఎం జగన్ శ్రీకారం

వెయ్యి పెంపు

వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుతో సహా జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అర్హత కల్గిన రైతులకు ఏడాదికి రూ.12 వేల 500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినా ...రైతు సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తి దృష్ట్యా సాయాన్ని ప్రభుత్వం మరో వెయ్యి పెంచింది. ప్రతి రైతుకు ఏటా 13 వేల 500 రూపాయలు చొప్పున ఐదేళ్ల పాటు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. 5 ఏళ్లలో 50 వేలు ఇస్తామన్న ప్రభుత్వం పెరిగిన మొత్తంతో 67 వేల 500 రూపాయలు రైతులకు అందివ్వనుంది. మే నెలలో 7 వేల 500, అక్టోబర్ నెలలో రబీ కోసం 4000, సంక్రాంతికి 2 వేల రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో అర్హులైన రైతులు, కౌలు రైతులకు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు రైతు భరోసా మొత్తాన్ని రైతులకు అందించనున్నారు.

అర్హుల జాబితా సచివాలయాల్లో

రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల మంది రైతులతో సహా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన మరో 3 లక్షలమందికి ఈ పథకం వర్తింపజేయనున్నారు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టారు. వెబ్​ల్యాండ్​లో ఉన్న రికార్డుల ఆధారంగా జాబితా రూపొందించారు. రైతు మరణిస్తే ఆయన భార్యకు భరోసా మొత్తాన్ని అందజేస్తారు. ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను సడలించాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు తగు చర్యలు తీసుకోనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన వారికి రైతుభరోసా ఇవ్వాలని, సంతృప్తికర స్థాయిలో పథకాన్ని వర్తింపు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దీని కోసం నవంబరు 15 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

5,510 కోట్లు విడుదల

ఆక్వాకల్చర్‌ కిందకు మార్చిన భూములు, రియల్‌ ఎస్టేట్‌ భూములు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపుపన్ను కట్టేవారిని రైతు భరోసాకు అనర్హులుగా ప్రకటించారు. రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని బ్యాంకులు మినహాయించుకోలేని విధంగా అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాలకే నగదు జమ కావాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి సాయాన్ని పంటలకు వినియోగించుకునేలా అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రైతు భరోసా పథకం అమలుకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఈ పథకానికి రూ. 5,510 కోట్లు విడుదల చేసింది.

సీఎం షెడ్యూలు ఇలా

ఉదయం 9.30 గంటలకు గన్నవరం నుంచి బయల్దేరి 10.15కి రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడ్నుంచి 11 గంటలకు కాకుటూరులోని సభా ప్రాంగాణానికి చేరుకోనున్న ఆయన...స్టాల్స్ పరిశీలిస్తారు. 11.30 గంటలకు వేదికపై నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి అమరావతికి చేరుకుంటారు.

ఇదీ చదవండి :

లెక్క తేలని రైతు భరోసా... అర్హుల ఎంపికలో జాప్యం

Last Updated : Oct 15, 2019, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details