హైకోర్టు ఉత్తర్వులతో ఆదివారం జరగనున్న జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నాయి. మొత్తం 13 జిల్లాల్లో 206 కేంద్రాల్లో పరిషత్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపునకు వీలుగా 206 కేంద్రాల్లో 958 హాళ్ల ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ఏర్పాట్లు, పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమించారు. ఇప్పటికే కలెక్టర్లు, అధికారులను ఎస్ఈసీ సమాయత్తం చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసుశాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఘర్షణలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలపై నిఘా పెట్టింది. అన్ని చోట్లా సెక్షన్ 144 అమలు చేయనున్నారు.
విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించారు. ఊరేగింపులు, బాణసంచా కాల్చేందుకు అనుమతి నిరాకరించారు. రాజకీయపార్టీలు, నేతలు సహకరించాలని పోలీసులు కోరారు. అన్ని జిల్లాల్లోని స్ట్రాంగ్ రూమ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియను వీడియో తీస్తామని చెప్పారు.
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్ఈసీ