ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 9, 2022, 4:22 PM IST

ETV Bharat / city

Kakinada SP on Loan Apps: లోన్​యాప్​లపై జాగ్రత్తగా ఉండాలి: కాకినాడ ఎస్పీ

Kakinada SP on loan apps: లోన్​యాప్​ వలలో చిక్కుకోకుండా ప్రజలు జాగ్రత్త పడాలని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రబాబు పిలుపునిచ్చారు. రుణాల కోసం బ్యాంకులు, ఫైనాన్షియర్లు సంప్రదించాలని సూచించారు. లోన్​ యాప్​లను బెదిరింపులు ఎదురైతే ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని.. పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు.

Kakinada SP
లోన్​యాప్​లపై ఎస్పీ

Kakinada SP on loan apps: లోన్ యాప్​లను వినియోగించి ఋణాలు తీసుకుని, వేధింపులకు గురి కావద్దని జిల్లా ప్రజలకు కాకినాడ జిల్లా రవీంద్రబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా పోలీసు కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవలి కాలంలో వినిపిస్తున్న ఆన్​లైన్ లోన్​యాప్ మోసాలపై ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపారు. లోన్ యాప్స్ అనేక దారుణాలకు కూడా కారణం అవుతున్నాయన్నారు. లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకొనేవారి స్మార్ట్‌ఫోన్లలోని కాంటాక్ట్స్, ఇతర వ్యక్తిగత సమాచారం యాప్ నిర్వహించేవారికి అనుసంధానించబడి రుణం తీసుకున్నవారు...ఈఎంఐ చెల్లించడంలో విఫలమైతే మానసికంగా వేధించడంతో పాటు వారి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి చెబుతామని, పరువు తీస్తామని బెదిరిస్తారన్నారు. రుణాలు ఇచ్చే యాప్‌ల ప్రతినిధులు అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు డిఫాల్టర్ల చిత్రాలను 'రేపిస్ట్' లేదా 'భికారీ నంబర్ 1', దొంగ వంటి ట్యాగ్‌తో మార్ఫింగ్ చేయడం, మిమ్మల్ని చనిపోయినట్లు ప్రకటిస్తారన్నారు. వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఫొటోలను అశ్లీలంగా మార్చి కుటుంబ సభ్యులకు లేదా ఫోన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న నెంబర్లకు, ఇంటర్నెట్​లో పెట్టి మిమ్మల్ని మానసిక ఆందోళనకు గురిచేసి మీ ప్రతిష్ఠకు భంగం కలిగించడం వంటివి చేస్తున్నారని ఎస్పీ తెలిపారు.

రుణాలు ఇచ్చే యాప్‌ల ప్రతినిధులు ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడి, వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా మనోధైర్యంగా వ్యవహరించి తక్షణమే పోలీసులకు సమాచారం అందజేయాలని సూచించారు. ప్రజలు, ముఖ్యంగా చదువుకుంటున్న యువత, మహిళలు ఈ ఆన్​లైన్ ఇన్​స్టెంట్ లోన్​యాప్​ల పట్ల ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్పష్టం చేశారు. అనధికార లోన్ యాప్​లను ఇన్​స్టాల్​ చేసేటప్పుడు తమ కాంటాక్ట్స్, మీడియా, గ్యాలరీ, కెమెరాలకు సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వొద్దని, రుణాలు తీసుకునే విషయంలో బ్యాంకుల్ని, ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల్ని ఆశ్రయించడమే శ్రేయస్కరమని రవీంద్ర బాబు విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే కాకినాడ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో లోన్​యాప్ మోసాల పట్ల ఫ్లెక్సీలు, కరపత్రాలు, వీడియోలు, సోషల్ మీడియా వేదికగా, మహిళా పొలుసులు, వాలంటీర్లు, వినూత్నంగా కళాజాత బృందాల ద్వారా జిల్లాలో అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల వరకు ప్రతి ఒక్కరికి చేరే విధంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందరికి ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్స్ తదితర సైబర్ నేరాల కేసుల దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన తరగతులు నిర్వహించి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ రవీంద్ర బాబు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details