Suspicious Death: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక సాక్షిగా ఉన్న కల్లూరు గంగాధర్రెడ్డి(40) అనంతపురం జిల్లా యాడికిలోని తన ఇంట్లో.. గురువారం అనుమానాస్పదస్థితిలో మరణించారు. అనారోగ్యం కారణంగా నిద్రలోనే మృతిచెందినట్లు ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. బుధవారం రాత్రి నిద్రపోయిన గంగాధర్రెడ్డిని గురువారం ఉదయం కుమార్తెలు నిద్ర లేపబోగా స్పందించలేదు. తర్వాత భార్య వచ్చి చూసి, అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి విచారిస్తున్నట్లు చెబుతున్నారు.
Suspicious Death: వివేకా హత్యకేసు.. సాక్షి గంగాధర్రెడ్డి అనుమానాస్పద మృతి - Viveka murder case witness Gangadhar reddy death

09:09 June 09
తాడిపత్రిలో పోస్ట్మార్టం పూర్తి
వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డికి గంగాధర్రెడ్డి అనుచరుడు. గంగాధర్రెడ్డి స్వగ్రామం పులివెందుల కాగా ప్రేమవివాహం చేసుకుని పదేళ్లుగా అనంతపురం జిల్లా యాడికిలో ఉంటున్నారు. వివేకా హత్యకేసులో గంగాధర్రెడ్డిని సీబీఐ అధికారులు మూడుసార్లు కడపకు పిలిపించి, విచారించారు. కేసును తనపై వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని శివశంకర్రెడ్డి చెప్పినట్లు గతేడాది అక్టోబరు 2న గంగాధర్రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. తర్వాత నిందితుల పేర్లు చెప్పాలంటూ సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ గతేడాది నవంబరులో అనంతపురం ఎస్పీకి ఫిర్యాదుచేశారు. తాను సీబీఐకి వాంగ్మూలం ఇవ్వలేదని.. అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డిపై తప్పుడు సాక్ష్యం చెప్పాలని జగదీశ్వర్రెడ్డి అనే వ్యక్తి ప్రలోభపెట్టాడని ఈ ఏడాది ఫిబ్రవరి 27న మీడియాకు తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని అనంతపురం ఎస్పీకి విన్నవించడంతో బందోబస్తు కల్పించారు. తర్వాత కొంతకాలానికి బందోబస్తును తొలగించారు. గంగాధర్రెడ్డి మృతదేహానికి తాడిపత్రి వైద్యవిధాన ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు.
మరణంపై అనుమానాలు
గంగాధర్రెడ్డి కొంతకాలంగా మధుమేహం, బీపీ, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, ఆ సమస్యలు ఎక్కువై మరణించారని ఆయన భార్య ఫరీదాబాను తెలిపారు. బుధవారం రాత్రి కుటుంబసభ్యులతో బాగానే మాట్లాడారు. వారం క్రితం వరకు తమతో కలిసి తిరిగినట్లు స్నేహితులు చెబుతున్నారు. మధుమేహం తీవ్రం కావడంతో రెండు కాళ్లు వాచాయి. రెండు రోజుల కిందట కాలిని ఎలుక కొరకడంతో గాయమైందని తెలుస్తోంది. రెండు రోజులుగా ఆరోగ్యం విషమించినా మెరుగైన చికిత్స అందించకుండా ఇంటి వద్దే ఆర్ఎంపీ వైద్యుడితో చికిత్స చేయించడం అనుమానాలకు తావిస్తోంది.
ఇవీ చూడండి:
TAGGED:
ap latest news