వారు పెద్దగా చదువుకోలేదు... సాంకేతిక పరిజ్ఞానంపైనా అంత పట్టు లేదు.. అయినా కడప పట్ణణ రిజిస్ట్రేషన్ అధికారులను బోల్తా కొట్టించగలిగారు.! నకిలీ చలానాలతో దర్జాగా రిజిస్ట్రేషన్లు చేయించేశారు. ఈ కుంభకోణంలో వినిపిస్తున్న పేర్లను పరిశీలిస్తే దాదాపు వారంతా రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో బాగా అనుభవం ఉన్నవారే. గత కొన్నేళ్లుగా వారు వేలాది రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను వారికి అనుకూలంగా మలుచుకున్నారు. చిన్నపొరపాటుతో అడ్డంగా దొరికిపోయారు. రిజిస్ట్రేషన్ల విషయంలో పాత విధానానికి.. కొత్త విధానానికి తేడా ఏమిటి.? ఈ వ్యత్యాసం అక్రమార్కులకు ఎలా ఉపయోగపడింది తదితర అంశాలపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
నకిలీ స్టాంపుల కుంభకోణం దేశాన్ని కుదిపేయడంతో కొన్నేళ్ల కిందట స్టాంపుల వినియోగాన్ని ప్రభుత్వం నామమాత్రం చేసింది. రిజిస్ట్రేషన్కు చెల్లించాల్సిన రుసుమును ఎంపిక చేసిన బ్యాంకులో చలానాగా చెల్లించాలని నిర్ణయించారు. ప్రతి రోజూ ఒక సబ్రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో కట్టిన చలానాల సంఖ్యను, చెల్లించిన నగదు వివరాలను బ్యాంకులు ఆ కార్యాలయానికి పంపిస్తాయి. ఈ తతంగం ముగిసిన అనంతరం ఆ కార్యాలయానికి చెందిన అధికారులు బ్యాంకు నుంచి వచ్చిన చలానా వివరాలతోపాటు దస్తావేజులతో కలిపి వినియోగదారులు సమర్పించిన చలానాలను సరిపోల్చుకుంటారు. ఈ విధానంలో చలానాల్లో స్వల్ప తేడాలున్నా, లోపాలున్నా ఎప్పటికప్పుడు తెలిసేవి.
నిందితుడి లావాదేవీల పరిశీలన పూర్తి...
నకిలీ చలానాల కుంభకోణం విలువ రూ.1.08 కోట్లకు చేరింది. నిందితుడు రామకృష్ణ ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించిన చలానాల పరిశీలన దాదాపు పూర్తయినట్లు తెలిసింది. ఇతడు కడప పట్టణ రిజిస్ట్రార్ కార్యాలయంలో 192 చలానాల ద్వారా, కడప గ్రామీణ కార్యాలయంలో 500 చలానాల ద్వారా దస్తావేజులను రిజిస్టరు చేయించినట్లు గుర్తించారు. శనివారం సాయంత్రం నాటికి తేలిన లెక్కల ప్రకారం రూ.1.08 కోట్ల మేర అక్రమ చలానాలు చలామణి అయ్యాయని రిమ్స్ పోలీసులకు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగిన నకిలీ చలానాల వ్యవహారం లెక్క తేలడంతో పోలీసులు అనుమానితుల బ్యాంకు ఖాతాల పరిశీలనకు ,చర్యలు తీసుకుంటున్నారు. నిందితుడికి సహకరించినవారితో పాటు కీలక పాత్ర పోషించినట్లు అనుమానమున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
అయిదుగురి సస్పెన్షన్
నకిలీ చలానాల వ్యవహారంలో అయిదుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీ శనివారం ఉత్వర్వులు జారీ చేశారు. కడప పట్టణ సబ్రిజిస్ట్రార్లు చంద్రమోహన్, సుబ్బారెడ్డి, జూనియర్ సహాయకులు రత్నమ్మ, కడప గ్రామీణ సబ్రిజిస్ట్రార్ హరికృష్ణ, జూనియర్ సహాయకులు సుకుమార్ను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినందున వారిపై చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
* 2018, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కంప్యూటర్ ద్వారా వచ్చే చలానాలపై అధికారుల ధ్రువీకరణ సంతకాలు, సీళ్లు ఉండవు. నకిలీ చలానాలు సృష్టించడానికి ఇది మొదటి లోపంగా మారింది. చలానా కట్టిన అనంతరం రిజిస్ట్రేషన్ చెల్లింపు మొత్తాన్ని ఎడిట్ చేసుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్రమార్కులు వాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆప్షన్తో అసలు చలనాలోని మొత్తాన్ని మార్చి తమకు కావాల్సిన మొత్తాన్ని వేసుకునే అవకాశం ఉన్నట్లు కొందరు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. తమకు కావాల్సినట్లు మార్పులు చేసుకున్న చలానాను దస్తావేజులకు జత చేసి రిజిస్ట్రేషన్కు పంపిస్తున్నారు. దస్తావేజులను సంబంధిత సబ్రిజిస్ట్రార్ చెక్ లిస్టు ప్రకారం స్టాంపులు కొన్న తేదీ, దస్తావేజు రాసిన తేదీ, కొన్నవారు, అమ్మినవారు, ఆస్తి సర్వే సంఖ్య, షెడ్యూల్, హద్దులు, విస్తీర్ణం, మార్కెట్ విలువ, పూర్వ దస్తావేజులను పరిశీలిస్తారు. ఇవన్నీ సక్రమంగా ఉంటే చలానా పత్రంలోకి వెళతారు. కంప్యూటర్లో చలానాలకు సంబంధిన అంశాలను పరిశీలించేటప్పుడు మొదట దస్తావేజు సంఖ్యను నమోదు చేస్తారు. వెంటనే నిర్దేశించిన కాలమ్స్లో కొనుగోలుదారుల వివరాలు కనిపిస్తాయి. ఈ దశ దాటిన తరువాత చలానా సంఖ్యను నిర్దేశిత గడిలో నింపుతారు. ఈ సంఖ్య సరైనదైతే మలి దశలోకి వెళ్లగలుగుతారు. చలానా సంఖ్య తప్పు వేసినా, అప్పటికే వినియోగించినదైనా తర్వాత దశకు వెళ్లలేరు. చలానా సంఖ్య సరిపోతే ఆ దస్తావేజుకు చెల్లించాల్సిన రుసుములు తెరపై కనిపిస్తాయి. దానికి సరిపడా మొత్తం చలానాలో ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తారు. చలానాలో సరిపడిన మొత్తం ఉండి , దాని స్టేటస్ సక్సెస్ అని కనిపిస్తే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. ఆ చలానాలో పొందుపరచిన మొత్తం సంబంధిత ఖాతాల్లో జమైందా? లేదా? అన్న అంశాన్ని శాఖలోని ఏ కార్యాలయంలోనూ పరిశీలిస్తున్న దాఖలాల్లేవు. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది.
ఇదీ చదవండి..