"గుంటూరు పొగాకు గూట్లో ఉన్నా.. నోట్లో ఉన్నా ఒకటే" అనేది నానుడి. గుంటూరు మిర్చికే కాదు.. ఇక్కడ పండే పొగాకుకూ అంత ఘాటు ఉంటుంది మరి. దీనికి తగ్గట్లుగానే పొగాకు సాగులో రాష్ట్రంలోనే గుంటూరు అగ్రస్థానంలో ఉంటుంది. ఇక్కడి నేలల్లో పండే పొగాకులో నికోటిన్ శాతం ఎక్కువగా ఉందనే కారణంగా జిల్లాలో సాగు తగ్గించారు. అయినా.. గుంటూరు కేంద్రంగానే పొగాకు వ్యాపారం సాగుతోంది.
రాష్ట్రంలో పండించే పొగాకులో 70 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే.. కొన్నేళ్లుగా ఎగుమతిదారులు సరైన ప్రోత్సాహకాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. 2014 వరకూ పొగాకు ఎగుమతులపై కేంద్రం 3 నుంచి 5శాతం మేర రాయితీల్ని అందించేది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేశారు. ఆర్ఓడీటీఈపీ(R.O.D.T.E.P.) పేరిట వ్యవసాయ ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నా.. అందులో నుంచి పొగాకును మినహాయించారు. ఇది వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. పొగాకు బోర్డు మాత్రం 30శాతం ఎగుమతులను పెంచాలని లక్ష్యంగా నిర్దేశించడంపై వ్యాపారులు పెదవి విరుస్తున్నారు.