ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 8, 2022, 9:20 PM IST

Updated : Jul 8, 2022, 9:28 PM IST

ETV Bharat / city

YCP Plenary: తొలిరోజు వైకాపా ప్లీనరీ.. నేతలు ఎమన్నారంటే ?

గుంటూరులో జరిగిన తొలిరోజు వైకాపా ప్లీనరీలో నాలుగు తీర్మానాలకు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తీర్మానాలపై పలువురు మంత్రులు, నేతలు మాట్లాడారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో అక్షరాస్యత శాతం పెరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మూడేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేసినట్లు మహిళా మంత్రులు పేర్కొన్నారు.

YCP Plenary
YCP Plenary

Leaders in YSRCP Plenary: తొలిరోజు వైకాపా ప్లీనరీలో నాలుగు తీర్మానాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆమోదం తెలిపారు. మహిళా సాధికారత-దిశా చట్టం, విద్యారంగం, నవరత్నాలు, వైద్య రంగంపై తీర్మానాలకు వైకాపా ప్లీనరీ ఆమోదం తెలిపింది. ప్రైవేటు పాఠశాలకు పోటీగా ప్రభుత్వపాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నూతన విద్యావిధానంపై ఇప్పటికిప్పుడు ఫలితాలు రావని.. ఐదేళ్ల తర్వాత వాటి ఫలాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. విద్యారంగంలో సంస్కరణలకు సహకరించాలని ఉపాధ్యాయ సంఘాలను కోరుతున్నట్లు తెలిపారు. వైకాపా ప్లీనరీలో విద్యారంగంపై మంత్రి బొత్స తీర్మానం ప్రవేశపెట్టారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో అక్షరాస్యత శాతం పెరిగిందన్నారు.

మూడేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేసినట్లు మహిళా మంత్రులు అన్నారు. మహిళలు అన్నివిధాలా అండగా ఉంటూ వారి అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. మహిళా సాధికారత- దిశ చట్టం ప్లీనరీలో చేసిన తీర్మానంపై మహిళా మంత్రులు మాట్లాడారు. రాష్ట్రంలో మహిళా సాధికారత పరిపూర్ణంగా జరిగిందని మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. 'వైకాపా హాయాంలో మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో 78 లక్షల మంది మహిళలకు 12 వేల 757కోట్లు ఇచ్చారు. మహిళలందరికీ పోషకాహారం ఇస్తూ ఆరోగ్యంగా ఉండేలా సీఎం చర్యలు తీసుకున్నారు. 4 లక్షలమంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి ద్వారా రూ. 13 వేల కోట్లు ఇచ్చి తల్లులకు సాయం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్​ఆర్ చేయూత ఇస్తున్నారు. అభినవ పూలెగా జగన్ సేవ చేస్తుంటే... పథకాలు ఆపాలని మహానాడులో డిమాండ్ చేశారు. ఈ వర్గాల మహిళలకు పథకాలు అందకూడదని చంద్రబాబు ఉద్దేశమా?. పార్టీలకు అతీతంగా జగన్ పథకాలు అమలు చేస్తున్నారు. మరోసారి జగన్​ను సీఎం చేసుకోవాలి' అని మంత్రి అన్నారు.

వైకాపా ప్లీనరీలో డాక్టర్​ షేక్​ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజు

అమ్మ జన్మనిస్తే.. ఆ బిడ్డకు జగన్ జీవితానిచ్చారు:అమ్మ జన్మనిస్తే .. ఆ బిడ్డకు ముఖ్యమంత్రి జగన్ జీవితానిచ్చారని మంత్రి రోజా అన్నారు. 'మహిళకు ప్రతి దశలోనూ ప్రభుత్వం ఉండగా ఉందని.. ఆడపిల్లల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. వారంలో రోజుల్లోనే ఫోరెన్సిక్ రిపోర్టులు అందుబాటులోకి వస్తున్నాయి. మూడేళ్లలో 120 కోట్లు ఎస్సీ, ఎస్టీ బాధితులకు పరిహారం ఇచ్చారు. మహిళలు ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జోరో ఎఫ్​ఐఆర్​ను సీఎం జగన్ తీసుకొచ్చారు. ప్రతి మహిళ, ఆడపిల్ల దిశ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకుని మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. దిశ కింద నమోదైన వాటిల్లో 97.68 కేసుల్లో దర్యాప్తు పూర్తైంది. ఆడపిల్లల రక్షణ గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశానికి లేదు' అని మంత్రి రోజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసినా వైకాపాను ఓడించలేవని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, జనసేన కలిసి వైకాపాను ఓడించగలమని నమ్మితే ఒంటరిగా పోటీ చేయాలని అన్నారు. వైకాపా శ్రేణులంతా జగన్ వన్స్ మోర్ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని సూచించారు.

ఇదీ చదవండి:YSRCP Plenary: అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారం: సీఎం జగన్

Last Updated : Jul 8, 2022, 9:28 PM IST

ABOUT THE AUTHOR

...view details