ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

క్లిష్టమైన శస్త్రచికిత్సలో గుంటూరు జీజీహెచ్ వైద్యుల సత్తా

గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యులు మరోసారి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అతని పక్కటెముకల్లో నుంచి గుండె, ఊపిరితిత్తులను కోసుకుంటూ వెళ్లింది. దీంతో కార్మికుడికి తీవ్ర రక్తస్రావమైంది. ఈనెల 13న ప్రకాశం జిల్లా మార్టూరు వద్ద ఓ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

By

Published : Dec 20, 2020, 2:11 PM IST

Guntur ggh  doctors successfully performed complex surgery.
గుంటూరు జీజీహెచ్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స

గ్రానైట్‌ రాయిని కత్తిరించే రంపం ప్రమాదవశాత్తు కార్మికుడి శరీరంలోకి దూసుకుపోయింది. అతని పక్కటెముకల్లో నుంచి గుండె, ఊపిరితిత్తులను కోసుకుంటూ వెళ్లింది. దీంతో కార్మికుడికి తీవ్ర రక్తస్రావమైంది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయిన అతడిని సహచర కార్మికులు గుంటూరు సర్వజనాసుపత్రికి తీసుకొచ్చారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం కార్డియో థొరాసిక్‌ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్‌ కళ్యాణి నేతృత్వంలో శస్త్రచికిత్స నిర్వహించారు. బ్లేడుకు చివరన రెండు అంగుళాల వెడల్పు కలిగిన మెటల్‌ స్క్రూ ఛాతీలో నుంచి ఊపిరితిత్తులను కోసుకుంటూ పోయింది. గడ్డకట్టిన రక్తంలో అది ఇరుక్కుపోయి ఉండటం సీటీ స్కాన్‌లో బయటపడింది. దీంతో తొలుత దాన్ని జాగ్రత్తగా బయటకు తీసి, తర్వాత దాదాపు మూడు గంటల పాటు శ్రమకోర్చి శస్త్రచికిత్స చేశారు. ఈ గాయాన్ని స్టాబ్‌ ఇంజ్యురీ (గుండె పొరను పొడుచుకుంటూ వెళ్లడం) అంటారని డాక్టర్‌ కళ్యాణి వివరించారు. కార్మికుడికి లీటరున్నర రక్తం పోగా.. తిరిగి రెండున్నర లీటర్లు ఎక్కించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. రెండు రోజుల్లో ఇంటికి పంపనున్నారు.

ఇదే శస్త్రచికిత్స ప్రైవేటు ఆస్పత్రుల్లో చేస్తే.. లక్షలాది రూపాయలు ఖర్చయ్యేది. ఈనెల 13న ప్రకాశం జిల్లా మార్టూరు వద్ద ఓ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ముకేష్‌(25)ది రాజస్థాన్‌ రాష్ట్రం. తోటి కూలీలు అతడిని ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. అతనికి ఆహారం, ఇతర సపర్యలు అన్నీ ఆసుపత్రి వైద్యులు, వార్డు సిబ్బందే చేశారు. శస్త్రచికిత్సలో మత్తు విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్‌ ఇనిమా, డాక్టర్‌ అచ్యుత్‌, పీజీ వైద్యులు శిరీష, అపర్ణ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details