ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్ర వ్యాప్తంగా మొదటిరోజు ముగిసిన పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

By

Published : Jun 14, 2021, 2:16 PM IST

Updated : Jun 14, 2021, 8:11 PM IST

సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, కేంద్రం ప్రకటించిన రూ.50 లక్షల బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండ్రోజుల తలపెట్టిన సమ్మె మొదటిరోజు విజయవంతమైనట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

samme
కార్మికుల ఆందోళన

పా కార్మికుల సమ్మెను అడ్డుకున్న పోలీసులు

తమ సమస్యలను పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండ్రోజుల సమ్మె మొదటిరోజు విజయవంతమైనట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు.

విశాఖ జిల్లాలో..

పెందుర్తి వేపగుంట జోనల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, కేంద్రం ప్రకటించిన రూ.50 లక్షల బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కరోనా ద్వారా చనిపోయిన పారిశుద్ధ్య కార్మికులకు కేంద్రం ప్రకటించిన బీమా సొమ్మును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో వేపగుంట జోనల్ కార్యలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు.

అనంతపురం జిల్లాలో..

అనంతపురం నగరపాలక సంస్థ వద్ద కార్మికులు చేస్తున్న సమ్మె ఉద్రిక్తతకు దారి తీసింది. సమ్మె చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు కార్మికుల సృహ కోల్పోయారు. అనంతరం కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

రాయదుర్గం పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు మొదటిరోజు సమ్మె విజయవంతమైనట్లు ప్రకటించారు. ముందుగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అక్కడి నుంచి వినాయక సర్కిల్, లక్ష్మీ బజార్ మీదుగా నూతన మున్సిపల్ కార్యాలయం వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో కార్మికులు సమ్మె చేస్తూ బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.

హిందూపురంలో ర్యాలీలో పాల్గొన్న కార్మికులు

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు అందిచాలని..మున్సిపల్ కార్మికులను సచివాలయాలకు బదిలీ చేయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈపీఎఫ్,ఈఎస్ఐ బకాయిలను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గుంటూరులో..

పురపాలక శాఖలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని.. లేని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని గుంటూరు మున్సిపల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు మధుబాబు హెచ్చరించారు.

గుంటూరులో ఆందోళనలో పాల్గొన్న నాయకులు

పిడుగురాళ్ల పురపాలక సంఘంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. రెండు రోజులపాటు చెత్త సేకరణ చేపట్టబోమని తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. తాడేపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు.

నెల్లూరులో..

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు మున్సిపల్ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని, అధికారం చేపట్టాక దాటవేశారని సీఐటీయూ నేతలు విమర్శించారు.

ప్రకాశంలో..

ప్రభుత్వం గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని తక్షణమే వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని కార్మికులు ఆందోళనకు దిగారు.

చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. కరోనా కష్ట సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పారిశుధ్య కార్మికులు అందించిన సేవలు చాలా గొప్పవని.. వారికి కనీస సౌకర్యాలైన మాస్క్, సానిటైజర్​లు ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు.

శ్రీకాకుళంలో..

శ్రీకాకుళంలో ఆందోళనలో పాల్గొన్న కార్మికులు

మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులందరిని వెంటనే పర్మినెంట్ చేయాలని, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. మోకాళ్లపై కూర్చొని ధర్నా నిర్వహించారు. సచివాలయాలకు బదలాయింపు ఆపాలని, కార్మిక సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు డిమాండ్ చేశారు.

విజయనగరంలో..

విజయనగరం జిల్లా బొబ్బిలిలో పారిశుద్ధ్య కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. డిమాండ్లు పరిష్కరించాలని పురపాలక కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.

కడప జిల్లాలో..
కడపలో ఆందోళనలో పాల్గొన్న కార్మికులు

కడప నగరపాలక అధికారులు నిరంకుశ పాలన అవలంభిస్తున్నారని సీఐటీయూ కడప జిల్లా అధ్యక్షులు మనోహర్ ధ్వజమెత్తారు. కార్మికుల సమ్మెలో భాగంగా కార్మికులు కోటిరెడ్డి నుంచి నగరపాలక కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కర్నూలు జిల్లాలో..

కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ధర్నా కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ అనుబంధ సంస్థ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు అన్నారు.

ఇదీ చదవండి:

'మాకు తక్షణమే జీతాలు పెంచండి.. ఉద్యోగాలు పర్మినెంట్ చేయండి'

Last Updated : Jun 14, 2021, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details