రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం వద్ద నిర్వహించే తిరునాళ్లు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు జిల్లా పాలనాధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఈనెల 11న మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగంతో ఆయన సమీక్షించారు. అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు.
'కోటప్పకొండ తిరునాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం' - కోటప్పకొండ తిరునాళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్షా
మహా శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం వద్ద ఏటా తిరునాళ్లు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా తిరునాళ్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులందరితో జిల్లా పాలనాధికారి వివేక్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. తిరునాళ్లు ప్రశాంతంగా జరిగేలా అన్నిశాఖల అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు.

తిరునాళ్ల రోజున కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఒకే చోట ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో వసతుల కల్పనలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పారు. భక్తులతో సున్నితంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండాముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: 15 సంవత్సరాల తర్వాత గుంటూరులో మున్సిపల్ ఎన్నికలు