ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏలూరులో తెదేపా త్రిసభ్య కమిటీ పర్యటన - eluru latest news

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తెలుగుదేశం త్రిసభ్య కమిటీ పర్యటించింది. కమిటీ సభ్యులైన చినరాజప్ప, రాజేంద్రప్రసాద్, అశోక్‌రాజ్.. వైద్యులతో చర్చించారు. అంతు చిక్కని వ్యాధి గురించిన లక్షణాలు, వాటి వివరాలు తెలుసుకున్నారు.

tdp committe members visit eluru in west godavari
ఏలూరులో తెదేపా త్రిసభ్య కమిటీ సభ్యుల పర్యటన

By

Published : Dec 13, 2020, 1:10 PM IST

Updated : Dec 14, 2020, 7:05 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ‘ఏలూరులో అంతు చిక్కని వ్యాధి బాధితులకు పూర్తిస్థాయిలో చికిత్స అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.. బాధితులకు శుద్ధజలం అందించాలి. వార్డుల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలి. ఇవన్నీ మీరు చేస్తారా లేక తెదేపా ఆధ్వర్యంలో మమ్మల్ని చేయించమంటారా’ అంటూ తెదేపా త్రిసభ్య కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి సవాల్‌ విసిరారు. రెండు రోజులు గడువిస్తున్నామని.. మీరు చేయకుంటే తర్వాత తామే చేస్తామని అన్నారు. అంతు చిక్కని వ్యాధి బాధితులను పరామర్శించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు మాజీ హోం మంత్రి చినరాజప్ప, ఎమ్మెల్సీలు బాబూరాజేంద్రప్రసాద్‌, అశోక్‌బాబు ఆదివారం ఏలూరు వచ్చారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అక్కడ అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. కొత్తపేటలో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చినా పూర్తిగా కోలుకోలేదని, కళ్లు తిరుగుతున్నాయని నీరసంగా ఉంటుందని.. నిలబడితే పడిపోయేలా ఉందని బాధితులు వివరించారు.

ఏలూరులో తెదేపా త్రిసభ్య కమిటీ సభ్యుల పర్యటన

ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున చికిత్స చేయిస్తాం

చినరాజప్ప మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు. నగరంలో 600 మందికిపైగా అంతుచిక్కని వ్యాధి బారిన పడినా.. ఇంకా ఆ వ్యాధికి కారణాలను ప్రభుత్వం తెలుసుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు. పూర్తిస్థాయిలో చికిత్స అందించకుండా హడావుడిగా ఇళ్లకు ఎందుకు పంపించారని ప్రశ్నించారు. బాధితుల్లో చాలా మంది ఫిట్స్‌తో కిందపడటంతో బాగా దెబ్బలు తగిలాయన్నారు. కొందరికి ఎముకలు విరిగాయని.. వారికి శస్త్రచికిత్స చేయాల్సి ఉందన్నారు.

ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున బాధితులకు తామే శస్త్రచికిత్సలు చేయిస్తామన్నారు. బాధితుల నుంచి సేకరించిన నమూనాల్లో నికెల్‌, లెడ్‌, క్రిమిసంహారక మందులు ఉన్నట్లు గుర్తించారని.. అవి ఎలా వచ్చాయో తేల్చాలన్నారు. నగరంలో పారిశుద్ధ్యం ఇంకా మెరుగు పరచలేదని ఆరోపించారు. ప్రభుత్వానికి చేతకాకుంటే తామే శ్రమదానంతో డ్రెయిన్లను శుభ్రం చేసి నగరాన్ని పరిశుభ్రంగా మారుస్తామన్నారు. ఎమ్మెల్సీలు బాబూ రాజేంద్రప్రసాద్‌, అశోక్‌బాబు మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సొంత నగరంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండటం దురదృష్టకరమన్నారు. గోడలకు సున్నాలు వేసేందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏలూరు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం రూ.కోటి వెచ్చించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచలేక పోయిందన్నారు. కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గ తెదేపా కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి), మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

అకస్మాత్తుగా స్పృహ కోల్పోతున్న నడికుడి కాలనీవాసులు

Last Updated : Dec 14, 2020, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details