రైతు దినోత్సవం పేరుతో వైఎస్ఆర్ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. అభిమాన నాయకుడి జయంతి సందర్భంగా రక్త దానం చేశారు. కొందరు మొక్కలు నాటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం సీఎం జగన్ అహర్నిషలు కృషి చేస్తున్నారని కొనియాడారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో..
కడపలోని ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ విగ్రహానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు పూలమాలవేసి నివాళులు అర్పించారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు.
జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో వైయస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పాలాభిషేకం చేసి పూల మాలలతో నివాళులర్పించారు.
అనంతపురం జిల్లాలో...
అనంతపురంలోని వైకాపా కార్యాలయంలో పార్టీ నాయకులు రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తండ్రి అడుగుజాడల్లో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ కొనియాడారు. రెండు తెలుగు రాష్ట్రాలకు వైఎస్ అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. అలాంటి ఆయన్ను తెలంగాణ మంత్రులు తిట్టిపోయడం తగదని అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో...
తణుకు లో వైఎస్ 72 వ జయంతి వేడుకల్ని అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు నిర్వహించారు. పేద బడుగు వర్గాల అభ్యున్నతికి వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ఆచరణీయమని పేర్కొన్నారు. కార్యకర్తలు రక్తదానం చేశారు.