ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా ఏడాది పాలన.. రైతుకు 'భరోసా'

రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టి ఏడాది పూర్తైంది. సరిగ్గా ఏడాది క్రితం ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది పాలన పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఏడాది పాలనకు గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధరల కల్పన, రైతు సమస్యలు సత్వరం పరిష్కరించేలా సీఎం యాప్​ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

By

Published : May 30, 2020, 12:37 PM IST

సీఎం జగన్
సీఎం జగన్

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అఖండ విజయం సాధించి అధికారం చేపట్టింది. వైకాపా అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తైంది. తొలిసారి ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై సీఎం మేధోమథన సదస్సు నిర్వహిస్తున్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించేలా

ఏడాది పాలన పూర్తైన సందర్భంగా రైతన్నలకు మేలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతు సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్రం వ్యాప్తంగా గ్రామానికి ఒకటి చొప్పున రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. సీఎం యాప్ (కాంప్రహెన్సివ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొక్యూర్​మెంట్‌)ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

వ్యవసాయ సంబంధ సేవలన్నింటినీ గ్రామాల్లోనే రైతులకు అందించేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,641 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సహాయకులు ఉంటారు. ఇక్కడ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ప్రభుత్వమే విక్రయించనుంది. భూసార పరీక్షలు జరిపి రైతులు ఏ పంట వేస్తే ప్రయోజనమో సలహాలు ఇస్తారు.

ఆధునిక వ్యవసాయ పద్ధతులు, తెగుళ్ల నివారణ సూచనలు, మార్కెటింగ్‌ మెళకువలపై రైతులకు సలహాలు ఇస్తారు. ఇ–క్రాప్‌ బుకింగ్‌కు రైతుకు తోడ్పడతారు. గ్రామంలో ఎంతమంది రైతులు, కౌలు రైతులు ఉన్నారో గుర్తించి ప్రభుత్వ రాయితీలకు సిఫార్సు చేస్తారు. రైతులకు శిక్షణా తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా ఆర్బీకేలు పనిచేయనున్నాయి.

పంటల ధరలను సీఎం యాప్​లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. రైతుకు గిట్టుబాటు ధర రాని పక్షంలో వెంటనే జోక్యం చేసుకుని ధరల స్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకుంటారని ప్రభుత్వం తెలిపింది. 10,641 గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ‘కియోస్క్‌’ల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్‌.. మార్కెటింగ్‌ సేవలు రైతులకు అందుతాయి. జాయింట్ కలెక్టర్ ఆర్‌బీకే పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తారు.

ఇదీ చదవండి:

వాలంటీర్​ వేధింపులు.. మాజీ మంత్రి కారు డ్రైవర్​ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details