ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Yadadri: యాదాద్రి ఉద్ఘాటనా పర్వం పరిసమాప్తం.. పులకించిన భక్తజనం

Yadadri Temple: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆరేళ్ల అనంతరం భక్తులకు యాదాద్రీశుడి స్వయంభూ దర్శనాలు ప్రారంభమయ్యాయి. దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న పంచనారసింహ క్షేత్ర ఉద్ఘాటనా పర్వం సంపూర్ణంగా పరిసమాప్తమయింది. మహాకుంభ సంప్రోక్షణ సుసంపన్నం కావడంతో మూలవర్తుల దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు.

By

Published : Mar 29, 2022, 7:25 AM IST

Published : Mar 29, 2022, 7:25 AM IST

1
1

యాదాద్రి ఉద్ఘాటనా పర్వం పరిసమాప్తం.. పులకించిన భక్తజనం

Yadadri Temple: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం దివ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా అద్భుతంగా రూపుదిద్దుకొంది. సువిశాలమైన ప్రాకారాలు, ఎతైన గోపురాలు, మండప సౌందర్యం, కృష్ణశిలా సోయగాలు, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో వైభవోపేతంగా విరాజిల్లుతోన్న క్షేత్ర ఉద్ఘాటనా క్రతువు పూర్తయింది. మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవానికి పూర్వాంగంగా ఈనెల 21 నుంచి నిర్వహించిన సప్తాహ్నిక దీక్షా పంచకుండాత్మక యాగం మహా పూర్ణాహుతి కార్యక్రమం నిన్న ఉదయం పూర్తయింది.

పల్లకి మోసిన సీఎం దంపతులు:అనంతరం బాలాలయంలో కొలువైన బంగారు కవచ, ఉత్సవ మూర్తులు, అల్వార్లను శోభాయాత్రగా ప్రధానాలయానికి తీసుకొచ్చారు. మాడవీధుల్లో ప్రదక్షిణ తర్వాత మూర్తులను ఆలయంలోకి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ దంపతులు స్వయంగా స్వామి వారి పల్లకి మోశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వేదపండితులు అనుసరించారు. అనంతరం శ్రవణా నక్షత్ర మిథిలా లగ్నాన మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్.. దివ్య విమానంపై శ్రీసుదర్శన చక్రానికి పవిత్ర గోదావరి జలాలతో అభిషేకం, సంప్రోక్షణ చేశారు. మిగతా గోపురాలు, మండపాలపై ఏర్పాటు చేసిన కళశాలకు మంత్రులు, ప్రముఖులు అభిషేకం చేశారు. ప్రధానార్చకుల ఆధ్వర్యంలో 92 మంది రిత్వికులు ఏకకాలంలో ఈ క్రతువు నిర్వహించారు. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం గర్భాలయంలో స్వయంభూల దర్శనాలు ప్రారంభం అయ్యాయి. తొలిపూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్​.. వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆరేళ్ల నిరీక్షణకు తెరదించుతూ... సామాన్య భక్తులకు స్వయంభూ దర్శనానికి అవకాశం లభించింది. ఆలయ పునరుద్ధరణ కోసం ప్రతిష్ఠామూర్తులను 2016 ఏప్రిల్‌లో బాలాలయంలోకి తరలించారు. అప్పటినుంచి బాలాలయంలోనే భక్తులకు స్వామి వారు దర్శనమిస్తున్నారు.

క్రతువులు పరిసమాప్తం:సాయంత్రం స్వామి వారి సన్నిధిలో శాంతి కల్యాణం, మహదాశీర్వాదం నిర్వహణతో క్రతువులు పరిసమాప్తి అయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీతా రెడ్డి తెలిపారు.

ఆన్​లైన్​లో టికెట్ల బుకింగ్​:ఆలయంలో నిత్య పూజాకైంకర్యాలు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆరంభిస్తారు. ఆరున్నర నుంచి 8 వరకు సర్వదర్శనాలకు అనుమతిస్తారు. 8 నుంచి 9 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత సర్వదర్శనాలకు అనుమతిస్తారు. రాత్రి 7.30 గంటల నుంచి 8.15 వరకు స్వామివారికి సహస్ర నామార్చన, శయనోత్సవ దర్శనం తర్వాత పది గంటలకు ప్రధానాలయం ద్వార బంధనం చేస్తారు. నేటి నుంచి భక్తులకు అన్ని రకాల దర్శనాలు, సేవలకు అవకాశం ఉంటుంది. ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ అవకాశాన్ని ఆలయ నిర్వాహకులు కల్పించారు. సాంకేతిక సహకారం ఈసీఐఎల్​ సంస్థ అందిస్తోంది.

ఇవీచూడండి:TDP 40TH ANNIVERSARY : రాజకీయ చైతన్యఝరికి 40 ఏళ్లు

ABOUT THE AUTHOR

...view details