ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 9, 2021, 7:49 AM IST

ETV Bharat / city

UPADHI HAMI PANULU: మూడేళ్లలో మెటీరియల్‌ బకాయిలు రూ.2412కోట్లు

రాష్ట్రంలో గత మూడేళ్లలో చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో మెటీరియల్ కాంపొనెంట్​ బకాయిలే రూ.2,512.77 కోట్లు చెల్లించాల్సి ఉంది. హైకోర్టు తీర్పుతో కొన్ని పాత బకాయిల్లో కదలిక వచ్చినప్పటికీ... కొత్త పనుల బిల్లులను మాత్రం మళ్లీ పెండింగ్‌లోనే పెట్టారు.

within-three-years-in-the-state-narega-material-arrears-rs-dot-2412-crore
మూడేళ్లలో మెటీరియల్‌ బకాయిలు రూ.2412కోట్లు

జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా)లో మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద రాష్ట్రంలో గత మూడేళ్లలో చేపట్టిన పనులకు ఇంకా రూ.2,512.77 కోట్ల బకాయిలు చెల్లించాలి. బిల్లుల చెల్లింపులో జాప్యంతో కొన్నిచోట్ల నిర్మాణ పనులు నెమ్మదిస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేసిన పలు పనుల బిల్లుల బకాయిలు తక్షణం చెల్లించాలని, వీటిపై 12 శాతాన్ని వడ్డీ నాలుగు వారాల్లో జమ చేయాలని 1,012 వ్యాజ్యాల్లో హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. దీంతో ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంటుందని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నరేగా వెబ్‌సైట్‌లో సమాచారం ప్రకారం మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద 2019-20, 2020-21, 2021-22లో ఇప్పటి వరకు రూ.7,398.65 కోట్ల విలువైన పనులు చేపట్టారు. వీటిలో ఇప్పటి వరకు రూ.4,476 కోట్లు చెల్లించారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ స్థాయిలో, ఇతర సాంకేతిక కారణాలతో కొన్ని బిల్లులు నిలిపివేయగా.. ఇంకా రూ.2,512 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. గత ఆరు నెలలుగా మెటీరియల్‌ పనులకు చెల్లింపులు నిలిపివేశారని మెటీరియల్‌ సరఫరాదారులు చెబుతున్నారు. దీంతో అనేక జిల్లాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్‌ వంటి భవన నిర్మాణ పనులు నెమ్మదించాయి. ఇందులో రైతు భరోసా కేంద్రాలు ఆగస్టు నెలాఖరుకే పూర్తవ్వాల్సి ఉన్నా చాలాచోట్ల కాలేదు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో తూర్పుగోదావరి, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి.

అనుకున్నదొకటి..

నరేగాలో పనిదినాలు ఎక్కువగా ఉపయోగించుకొని మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద గ్రామాల్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. గత రెండేళ్లలో భారీగా పనిదినాలు వినియోగించుకుంది. వీటితో ‘మెటీరియల్‌ ఎన్‌టైటిల్‌మెంట్‌’ కింద రూ.7 వేల కోట్లకు పైగా నిధులు సమకూరుతాయని అధికారులు అంచనా వేశారు. గత రెండేళ్లలో రూ.10 వేల కోట్లకుపైగా విలువైన మెటీరియల్‌ పనులు ప్రారంభించారు. వీటిలో సింహభాగం భవనాలే ఉన్నాయి. కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యంతో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించలేకపోతోంది. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిధులు సర్దుబాటు చేసి బిల్లులు చెల్లించేది. కేంద్రం నుంచి నిధులొచ్చేలోపు రూ.1,000 కోట్లు సమకూర్చితే కొన్ని పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఇటీవల ప్రతిపాదించినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. 2021-22లో ఇప్పటికే వినియోగించుకున్న 20 కోట్ల పనిదినాలకు మెటీరియల్‌ ఎన్‌టైటిల్‌మెంట్‌ కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.1,134.08 కోట్లు విడుదల చేసింది. పాత బకాయిలతో కలిపి మరో రూ.3,500 కోట్లకుపైగా రావలసి ఉందని అధికారులు అంటున్నారు.

ఇదీ చూడండి:HYDERABAD RAINS: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వర్షం.. నాలాలో పడిన వ్యక్తి సురక్షితం

ABOUT THE AUTHOR

...view details